నవాబ్‌ మాలిక్‌కు డి-కంపెనీతో సంబంధాలు!

నవాబ్‌ మాలిక్‌కు డి-కంపెనీతో సంబంధాలు!
మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు నవాబ్‌ మాలిక్‌కు గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీంతోనూ, అతనికున్న డి-కంపెనీతో చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) దర్యాప్తులో తేలింది. ఈ మేరకు నవాబ్‌మాలిక్‌పై ముంబైలోని ప్రత్యేక పిఎంఎల్‌వి కోర్టులో మనీలాండరింగ్‌ కేసును ఇడి నమోదు చేసింది. 
 
డి-కంపెనీతో మాలిక్‌కు ఉన్న లింక్‌ను ఇడి దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. అలాగే 1996లో కుర్లాలోని గోవాలా బిల్డింగ్‌ కాంపౌండ్‌ను ఆక్రమించుకునే కుట్ర పన్నారని పేర్కొంది. కాగా, ఈ కేసుకు సంబంధించి దావూద్‌ ఇబ్రహీం మేనల్లుడు అలీషా పార్కర్‌ను ఇడి అధికారులు సోమవారం ప్రశ్నించారు. 
 
ఈ కేసు సందర్భంగా పార్కర్‌ మనీలాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 50 కింద ఇడికి వాంగ్మూలం ఇచ్చాడు. తన మేనమామ దావూద్‌ ఇబ్రహీం.. తన తల్లి చనిపోయేవరకు ఆర్థిక లావాదేవీలు జరిపేవారని పార్కర్‌ తెలిపారు. అలాగే తన తల్లితో ఆస్తి లావాదేవీల్లో సలీం పటేల్‌ అనే ఉల్లిపాయల వ్యాపారి కూడా ఉన్నారని పార్కర్‌ పేర్కొన్నాడు.
 
 పటేల్‌ తన కార్యాలయాన్ని ప్రారంభించడానికి గోవాలా బిల్డింగ్‌లోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారని పార్కర్‌ తెలిపాడు. ఆ తర్వాత కొంత భాగాన్ని నవాబ్‌ మాలిక్‌ విక్రయించాడని అన్నాడు. అయితే తన తల్లికి నవాబ్‌ మాలిక్‌ చెల్లించిన డబ్బు గురించి తెలియదని చెప్పాడు.
 
నవాబ్‌ మాలిక్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన ఛార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టు శుక్రవారం పరిగణనలోకి తీసుకుంది. కుర్లాలోని గోవాలా కాంపౌండ్‌ను ఆక్రమించడానికి ఇతరులతో నేరపూరిత కుట్రలో మాలిక్‌ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు సూచించడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని ఇడి పేర్కొంది. కోర్టు ఈ కేసులో 1993 బాంబు పేలుడు నిందితుడైన సర్దార్‌ షావాలా ఖాన్‌ పేరును కూడా చేర్చింది.