మనీ లాండరింగ్‌ కేసులో ఐఏఎస్‌ అధికారిణి అరెస్ట్

ఐఏఎస్‌ అధికారిణి పూజా సింఘాల్‌ను మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ అధికారులు బుధవారం అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌కు ముందు ఆమెను కొన్ని గంటలపాటు కేసుకు సంబంధించి అధికారులు విచారణ జరిపారు. కాగా పూజా సింఘాల్‌ జార్ఖండ్‌ రాష్ట్ర గనులశాఖ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.
కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడటంతోపాటు ఎమ్‌ఎన్‌ఆర్‌ఈడీఏ (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం) నిధులను దారి మళ్లించారనే అభియోగాలతో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు గతవారం దాడులు నిర్వహించారు.  ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ నివాసంతోపాటు  ఆమె సన్నిహితుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏకకాలంలో దాడులు చేపట్టింది.
  జార్ఖండ్ ప్రభుత్వంలో మాజీ జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రామ్ బినోద్ ప్రసాద్ సిన్హాపై ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి, తన కుటుంబ సభ్యుల పేరుతో పెట్టుబడి పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని పశ్చిమ బెంగాల్‌లో జూన్ 17,2020న ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అవినీతికి గురైన డబ్బు ఖుంటి జిల్లాలో ఎమ్‌ఎన్‌ఆర్‌ఈడీఏ కోసం కేటాయించినట్లు ఈడీ పేర్కొంది.
 నిందితుడిని విచారించగా మోసగించిన నిధుల నుంచి తాను జిల్లా పరిపాలనకు ఐదు శాతం కమీషన్ ఇచ్చినట్లు వెల్లడించాడు. దీంతో పూజా సింఘాల్ 2007 నుంచి 2013 వరకు చత్రా, ఖుంటి, పాలము డిప్యూటీ కమిషనర్/జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేసే సమయంలో ఆమె అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ అభియోగాలు మోపింది.
ఈ కేసులో భాగంగా మే 7వ తేదీన పూజా సింఘాల్‌ సీఏ సుమన్ కుమార్ వద్ద రూ.17 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. అలాగే పూజా సింఘాల్‌, ఆమె భర్తతో ఉన్న సంబంధాలపై కూడా ఈడీ విచారణ జరుపుతోంది. సింఘాల్, ఆమె భర్త రూ. 1.43 కోట్ల వరకు భారీగా నగదు డిపాజిట్లు చేసుకున్నట్లు,  ఆమె జీతం కంటే ఎక్కువగా బ్యాంక్‌ ఖాతాల్లోకి డబ్బులు వెళ్లినట్లు ఈడీ పేర్కొంది.