సాంకేతిక సాక్ష్యాలతోనే నారాయణ అరెస్ట్ … కోర్టులో బెయిల్ 

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల మాల్ ప్రాక్టీస్ లో పక్కా ఆధారాలు దొరకడం వల్లే నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అరెస్టు చేశామని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. 

అయితే, నారాయణకు గత రాత్రి వ్యక్తిగత పూచీకత్తుతో మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. గత రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం నారాయణను చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. అనంతరం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా..2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నారాయణ తరపు న్యాయవాదులు పేపర్లతో సహా ఆధారాలను న్యాయమూర్తికి చూపించారు. దీంతో పోలీసుల అభియోగాన్ని మెజిస్ట్రేట్ తోసిపుచ్చింది.

మీడియా సమావేశంలో ఎస్పీ  మాట్లాడుతూ తెలుగు పేపర్ మాల్ ప్రాక్టీస్ కు గురైందని చిత్తూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదులు నమోదు కావడంతో అప్రమత్తమై కేసు దర్యాప్తు చేపట్టగా చెప్పారు. సాంకేతిక సాక్ష్యాలు దొరకడంతో కొందరిని అరెస్టు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. 

పట్టుపడిన వారిని విచారించగా నారాయణ విద్యా సంస్థల బ్రాంచ్ డీన్ బాలగంగాధర తిలక్ ను అదుపులోకి తీసుకుని ఆయనతోపాటు, నారాయణకు కూడా సంబంధాలున్నట్లు ఆధారాలు దొరకడంతో ఇవాళ ఉదయం హైదరాబాద్ కు వెళ్లి అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తీసుకొచ్చామని వివరించారు.

మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం జరుగుతున్న నేపథ్యంలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కేసులోనే నారాయణను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటించారు. ఆయనను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. నిందితులపై ఐపీసీ 408, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

మాల్ ప్రాక్టీస్ అంతా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు విచారణలో వెల్లడైందని, గత నెలలో తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ అయినట్లు ఫిర్యాదులు రావడంతో నిఘా పెట్టగా నిజమేనని గుర్తించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పనిచేస్తున్న అటెండర్లు, వాటర్ బాయ్ లు, ఇతర సహాయ సిబ్బంది, నిర్వాహకుల గురించి ముందే సమాచారం తెలుసుకున్నారని చెప్పారు. 

సెంటర్లో పనిచేస్తున్న వారిలో తమకు అనుకూలమైన వారిని లొంగ దీసుకుని, వారి ద్వారా మిగతా వారిని లొంగదీసుకుని నిరాటంకంగా మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు తేలిందని చెప్పారు. ముందుగా వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. డొంకంతా కదలిందని వివరించారు. 

తమ వద్ద చదువుకునే విద్యార్థులను రెండు కేటగిరీలుగా విభజించి, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు గుర్తించామని వెల్లడించారు.  బాగా చదివే వారిని ఒక కేటగి, అంతగా చదవని వారిని మరో కేటగిరి కింద విభజించి వారికి మాల్ ప్రాక్టీస్ చేయిస్తున్నారని తెలిపారు.

అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ పేపర్ లీకేజీ అయ్యాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పకడ్బందీగా విచారణ జరిపామని చెప్పారు. ర్యాంకుల కోసమే మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. తమ విద్యార్థులు ఎక్కడెక్కడున్నారో ముందు తెలుసుకుంటారని, అడ్మిషన్లు పెంచుకునేందుకే మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు గుర్తించామని వివరించారు.

పరీక్ష మొదలైన వెంటనే ప్రశ్నాపత్రాన్ని బయటకు పంపిస్తారని, హెడ్ ఆఫీసులో వెంటనే కీ తయారు చేసి విద్యార్థులకు పంపిస్తారని చెప్పారు. జవాబు పత్రాన్ని లోపలికి పంపడానికి వాటర్ బాయ్స్ లేదా  ఇతరులు ఎవరైతే లొంగుతారో  అలాంటే వారిని వాడుకున్నట్లు గుర్తించామని తెలిపారు. 

ఈసారి ముందే అలర్ట్ కావడంతో మాల్ ప్రాక్టీస్ బయటపడిందిని చిత్తూరు జిల్లా ఎస్పీ వివరించారు. గతంలోనూ ఇలాగే లీకులు చేశారా? మిగతా విద్యా సంస్థలకు కూడా ఏమైనా పాత్ర ఉందా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ చెప్పారు.  సెక్షన్ 408, 409 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు వర్గాల కథనం.