గుజరాత్లోని మోర్బి జిల్లాలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన హనుమంతుడి విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామికావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
శనివారం హనుమాన్ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందు మోదీ ఇచ్చిన ట్వీట్లో, నేడు మనం హనుమాన్ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. మోర్బిలో శనివారం ఉదయం 11 గంటలకు 108 అడుగుల ఎత్తయిన హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం రావడం గౌరవప్రదంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, హనుమాన్జీ4ధామ్ ప్రాజెక్టులో భాగంగా నాలుగు హనుమంతుడి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు దిశల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
దేశానికి పశ్చిమంలో మోర్బిలోని పరమ పూజ్య బాపు కేశవానంద ఆశ్రమంలో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి విగ్రహాన్ని 2010లో సిమ్లాలో ఏర్పాటు చేశారు. దక్షిణాదిలో రామేశ్వరంలో హనుమంతుడి విగ్రహ ఏర్పాట్లను ప్రారంభించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యసాహసాలు, సంయమనాలకు ప్రతీక హనుమంతుడని పేర్కొన్నారు. పవనపుత్రుని దయతో అందరి జీవితాల్లో బలం, వివేకం, జ్ఞానం నిండాలని ఆకాంక్షిస్తూ ఈ ట్వీట్ చేశారు.

More Stories
ఢిల్లీ పేలుడుకు నేపాల్ లో మొబైళ్లు, కాన్పూర్ లో సిమ్ లు
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దు
అసోంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ