ఏడేళ్లలో 2.5 రేట్లు పెరిగిన వ్యవసాయ రుణాలు 

ఏడేళ్లలో 2.5 రేట్లు పెరిగిన వ్యవసాయ రుణాలు 
 రైతులకు వ్యవసాయ రుణాలు ఏడేళ్లలో 2.5 రెట్లు పెరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ  గురువారం తెలిపారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే వివిధ మార్గాలపై గురువారం వెబ్‌నార్‌ నిర్వహించారు.
 
 ‘స్మార్ట్‌ అగ్రికల్చర్‌’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ  మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం ఇదేరోజున ప్రారంభమైన పిఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రైతులకు ఆసరాగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 11 కోట్ల మంది రైతులకు సుమారు రూ. రెండు లక్షల కోట్లు అందించామని తెలిపారు. 
 
గత ఏడేళ్లలో అనేక కొత్త కార్యక్రమాలు చేపట్టామని చెబుతూ  విత్తనాలను మార్కెట్‌కి తీసుకెళ్లడం వరకు అన్ని పాత పద్ధతులను మెరుగుపరిచామని చెప్పారు. ఏడేళ్లలో వ్యవసాయానికి బడ్జెట్‌లో కేటాయింపులు అనేక రెట్లు పెరిగాయని, ఈ ఏడాది కూడా కేంద్రబడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మెరుగైన సహకారం అందించామంటూ ప్రశంసలు కురిపించారు. 
 
పిఎం -కిసాన్‌ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి రూ.6వేలు వ్యవసాయ రుణాలు అందిస్తున్నామని, ఒక్కొక్కరికి రూ. రెండువేల చొప్పున మూడు సమాన వాయిదాలలో చెల్లించబడుతుందని వివరించారు. లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయబడతాయని గుర్తు చేశారు.