స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ పోషించిన పాత్రను గౌరవిస్తూ ఆయన విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం చెప్పారు. నేతాజీ 125వ జయంతిని యావత్తు దేశం జరుపుకుంటున్న వేళ గ్రానైట్తో తయారు చేసిన ఆయన విగ్రహాన్ని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అందరితో పంచుకుంటుండటం తనకు సంతోషంగా ఉందని ఓ ట్వీట్లో తెలిపారు.
ఇది రుణం తీర్చుకునే, కృతజ్ఞతాభావానికి ప్రతీక అని ప్రధాని తెలిపారు. దివ్యమైన నేతాజీ విగ్రహం తయారీ పూర్తయ్యే వరకు ఇండియా గేట్ వద్ద ఆయన హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ హోలోగ్రామ్ విగ్రహాన్ని జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా ఆవిష్కరిస్తానని ఆయన తెలిపారు.
మొదటి ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్ను నేతాజీ ఏర్పాటు చేశారు. 1943లో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసి, బ్రిటిష్ పాలకులపై సాయుధ తిరుగుబాటును ప్రారంభించారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేవిధంగా వేలాది మంది భారతీయులను ప్రేరేపించారు. ‘‘నువ్వు నాకు రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’’, ‘‘జైహింద్’’, ‘‘ఢిల్లీ చలో’’ వంటి నినాదాలతో భారతీయులను ప్రేరేపించి, ఉత్తేజితులను చేశారు.
అమర జవాన్ జ్యోతి విలీనం
ఇలా ఉండగా, అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా శుక్రవారం తెలిపింది. భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల స్మారకార్థం ఈ అమర జవాన్ జ్యోతిని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేశారు. 50 ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన ఈ జ్యోతిని ఆర్పేస్తున్నారని తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు మీడియా తెలిపింది.
‘‘అమర జవాన్ జ్యోతి 1971లో జరిగిన యుద్ధం, ఇతర యుద్ధాల్లో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది, కానీ వారి పేర్లు అక్కడ లేకపోవడం విచిత్రం. ఒకటో ప్రపంచ యుద్ధంలోనూ, ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్దంలోనూ బ్రిటిష్ పాలకుల తరపున పోరాడిన కొందరు అమరుల పేర్లు మాత్రమే ఇండియా గేట్పై రాసి ఉన్నాయి. ఇది మన వలస పాలనకు ప్రతీక. 1971లో, ఆ తర్వాత, ముందు జరిగిన, అన్ని యుద్ధాల్లోనూ అమరులైన భారతీయ అమర వీరుల పేర్లన్నీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్నాయి. కాబట్టి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించే జ్యోతి జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండటమే నిజమైన శ్రద్ధాంజలి అర్పించడం అవుతుంది’’ అని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది.
అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేయడాన్ని విమర్శించడం హాస్యాస్పదమని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఏడు దశాబ్దాలపాటు జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించనివారు ఇప్పుడు అమరులకు శాశ్వతంగా, దీటైన శ్రద్ధాంజలి ఘటించే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటే విమర్శించడం వింతగా ఉందన్నారు.
ఇదిలావుండగా, జాతీయ యుద్ధ స్మారకం ఇండియా గేట్కు సుమారు 500 మీటర్ల దూరంలో ఉంది. ఇండియా గేట్ ఎత్తు 42 మీటర్లు. మొదటి ప్రపంచ యుద్ధం (1914-18), మూడో ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం (1919)లలో అమరులైన వేలాది మంది భారతీయ సైనికుల పేర్లను దీని మీద రాశారు. దీనిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది.
మొదట్లో దీని వద్ద అమర జవాన్ జ్యోతి ఉండేది కాదు. భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అమరులైన 3,843 మంది భారతీయ సైనికుల స్మారకార్థం అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ జ్యోతిని ఏర్పాటు చేసింది. దీనిని ఇందిరా గాంధీ 1972 జనవరి 26న ఆవిష్కరించారు. భారతీయ దళాల అధిపతులు, విదేశీ నేతలు ఇక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు. గణతంత్ర దినోత్సవాలనాడు ప్రధాన మంత్రి అమర వీరులకు నివాళులర్పిస్తూ ఉంటారు.
జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్మించింది. భారత దేశ పరిరక్షణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన భారతీయ సైనికుల స్మారకార్థం దీనిని నిర్మించింది. 2019 ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు. అనంతరం అమరులకు శ్రద్ధాంజలి ఘటించే అన్ని కార్యక్రమాలను ఇక్కడే నిర్వహిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవాలు, స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా అమరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఈ స్మారకంపై 25,942 మంది అమర వీరుల పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించారు.
More Stories
డబ్బులేకే పోటీ చేయడం లేదు .. నిర్మలా
రేవంత్ పక్కన ఉన్నవాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేశారు
రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు