ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెర లేపారు. వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్న దృష్ట్యా పలు పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు టికెట్ల కోసం పార్టీలు మారుతున్నారు. ముఖ్యంగా బీజేపీలో చేరుతున్నారు.
తాజాగా సమాజ్వాదీ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్పీ వ్యవస్థపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన మరుసటి రోజే ఆయన తోడల్లుడు మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరారు.
ప్రమోద్ గుప్తాతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ప్రియాంక మౌర్య, కాంగ్రెస్ ఎమ్యెల్యే అదితి సింగ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘లడ్కీ హూన్, లడ్ సక్తి హూన్’ ప్రచారంలో ప్రియాంక మౌర్య పోస్టర్ గర్లగా ఉండి కీలకంగా వ్యవహరించారు.
బీజేపీలో ఆమె చేరిక కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగనుందని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఓబీసీ వర్గాల్లో ఇబ్బంది పడుతున్న బీజేపీకి ములాయం చిన్న కోడలు బీజేపీలో చేరడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా మారింది.
సమాజ్ వాదీపార్టీ నేరగాళ్లు, జూదగాళ్లకు అడ్డాగా మారిందని ప్రమోద్ గుప్తా ఆరోపించారు. అఖిలేష్ యాదవ్ ములాయంసింగ్ నే జైలులో పెట్టాడని ప్రమోద్ గుప్తా ఆరోపించారు. ఎస్పీ పార్టీ పరిస్థితి మరీ దారుణంగా మారిందని ప్రమోద్ విమర్శించారు.
మరోవంక, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆదితిసింగ్ గురువారం పార్టీకి రాజీనామా చేశారు. ఆదితిసింగ్ గతంలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినా అధికారికంగా సోనియాగాంధీకి రాజీనామా లేఖను గురువారం పంపించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీ బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిల్ లో సమాజ్ వాదీపార్టీని లక్ష్యంగా చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.
ఇలా ఉండగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన అఖిలేష్ యాదవ్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.అఖిలేష్ యాదవ్ మైన్పురి సదర్, ఛిబ్రామౌ (కన్నౌజ్), గోపాల్పూర్ (అజంగఢ్), గున్నౌర్ (సంభాల్) అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే విషయమై అఖిలేష్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నాలుగు స్థానాల్లో ఏ స్థానం నుంచి అఖిలేష్ ఎన్నికల బరిలోకి దిగుతారన్నది జాబితా విడుదల చేసే దాకా ఆగాల్సిందే.
More Stories
వయనాడ్ నుంచి ప్రజలు రాహుల్ ను తరిమికొడతారు
అధికారంలోకి వస్తే ఎలక్టోరల్ బాండ్స్ని మళ్లీ తీసుకొస్తాం
తొలి దశలో 62.37 శాతం మాత్రమే పోలింగ్