
గొలుసుకట్టు విధా నంలో 10లక్షల మంది నుంచి రూ.1500 కోట్ల వసూళ్లకు పాల్పడిన ఇండస్ వివా కంపెనీ ప్రతినిధులు అంజారంద్, అభిలాష్లను శుక్రవారం నాడు ఇడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని ఇడి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది.
గొలుసు కట్టు విధానంలో లేనిపోని ఆశలు కల్పించి ఇండస్ వివా కంపెనీ మోసం చేస్తోందని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 9 నెలల క్రితం కేసు నమోదైన విషయం విదితమే. గొలుసుకట్టు వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలతో అంజారంద్, అభిలాష్ను ఇడి అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో సుమారు రూ.1500 కోట్లు మోసం చేసినట్లు తేలడంతో నిందితులపై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు కొంతమంది ఇండస్ వివా ప్రతినిధులను అరెస్టు చేశారు.
గొలుసు కట్టు విధానంలో వ్యాపారం నిర్వహిస్తున్న ఇండస్ వివా ప్రతినిధులు దాదాపు పది లక్షల మంది సభ్యులను చేర్చుకొని వాళ్ల నుంచి రూ.1,500 కోట్లు వసూలు చేసినట్లు ఇడి అధికారులు గుర్తించారు. పిరమిడ్ విధానంలో కొత్త సభ్యులను చేర్చితే కమిషన్ ఇస్తామంటూ ఇండస్ వివా ప్రతినిధులు సభ్యత్వ రుసుము కట్టి చేరితే కంపెనీకి చెందిన ఉత్పత్తులను విక్రయించాలని టార్గెట్గా పెట్టేవారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
సాధారణ ఉత్పత్తులకు సైతం అధిక రేట్లకు అమ్మితే కమిషన్ ఇచ్చే వాళ్లని, వసూలుచేసిన డబ్బులను కంపెనీ ఖాతాలో జమ చేసి ఆ తర్వాత వ్యక్తిగత ఖాతాలకు మళ్లించేవారని ఇడి విచారణలో తేలింది. నిందితులు వసూలు చేసిన మొత్తాలతో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని విషయాలు దర్యాప్తు చేయాల్సి ఉందని ఇడి అధికారులు వివరిస్తున్నారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!