హెలికాప్టర్ ప్రమాదంపై చైనా అవాకులు, చవాకులు

చైనా, పాకిస్థాన్ ల కవ్వింపు చర్యలను ధీటుగా ఎదుర్కొనే విధంగా చేయడంతో పాటు, సరిహద్దులలో వారి దుశ్చర్యలను కట్టడి చేసే విధంగా భారత సేనలను సమాయత్త పరచిన చీఫ్ అఫ్ ( సిసిఎస్) జనరల్ బిపిన్ రావత్ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందటంపై సానుభూతి చూపవలసింది పోయి, చైనా అవాకులు, చవాకులు పేలడం ద్వారా ఈ వీర సేనాని పట్ల తమ అసహనాన్ని  వ్యక్తం చేసింది. 

 భారత సైన్యానికి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత లేదని,   జనరల్ రావత్ మరణం వల్ల భారత దేశ సైన్యం ఆధునికీకరణకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని అంటూ తన అక్కసు వెళ్లగక్కింది.   చైనాలోని నిపుణులను ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ ఆధ్వర్యంలోని గ్లోబల్ టైమ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది.

చైనాపై వ్యతిరేకత వ్యక్తం చేసే అత్యున్నత స్థాయి భారతీయ నేత మరణించినప్పటికీ, చైనా పట్ల భారత దేశ దూకుడు వైఖరి మారే అవకాశం లేదని చైనా విశ్లేషకులు చెప్తున్నారని పేర్కొంది. భారతీయ మీడియా చెప్తున్న కారణాలను పరిశీలించినపుడు ఈ ప్రమాదానికి కారణం మానవ తప్పిదమేనని వెల్లడవుతోందని ఆరోపించింది. 

రష్యాలో తయారైన ఎంఐ-17 సిరీస్ హెలికాప్టర్లను ఇతర దేశాల్లో కూడా విస్తృతంగా వాడుతున్నారని గుర్తు చేసింది. క్రమశిక్షణరాహిత్య సంస్కృతికి భారతీయ సైన్యం పెట్టింది పేరు అని ఎగతాళి చేసింది. ప్రామాణిక నిర్వహణ విధానాలను, నిబంధనలను భారతీయ దళాలు తరచూ పాటించబోవని పేర్కొంది.

2013లో ఓ జలాంతర్గామిలో పేలుడు జరిగిందని, 2019లో ఓ విమాన వాహక నౌకలో అగ్ని ప్రమాదం సంభవించిందని, వీటన్నిటికీ కారణాలు మానవ తప్పిదాలేనని అంటూ అసంబద్ధ వాఖ్యలు చేసింది.  ఈ ప్రమాదం వల్ల భారత సైన్యానికి పోరాట సన్నద్ధత లేదని మరోసారి తేటతెల్లమైందని అంటూ భారత్ సైన్యం పట్ల తన అసలు భయాన్ని బయటపెట్టింది.

పైగా,  జనరల్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదం నివారించదగినదేనని చెప్తూ, వాతావరణం మెరుగయ్యే వరకు ప్రయాణాన్ని వాయిదా వేయడం, పైలట్ మరింత నైపుణ్యంతో, జాగ్రత్తగా నడపటం, గ్రౌండ్ మెయింటెనెన్స్ సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించడం వంటివాటిలో ఏది జరిగినా, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటూ ఊహాజనిత వాఖ్యలు చేసింది.

ఈ సాధారణ సమస్య యావత్తు భారత సైన్యానికి ఉందని, చైనా-భారత్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న సైన్యానికి కూడా ఇదే సమస్య ఉందని అంటూ శాపనార్ధాలు పెట్టింది.  సరిహద్దుల్లోని సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ ఉంటుందని, నిజంగా పోరాటం ప్రారంభమైతే చైనా సైన్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉండబోదని అంటూ పగటి కలలను ప్రచారం చేసింది. 

భారత సైన్యం, నావికా దళం, వాయు సేన మధ్య వైరుద్ధ్యాలను తొలగించడం కోసం మధ్యవర్తిత్వం వహించడానికి జనరల్ రావత్‌ను సీడీఎస్‌గా భారత ప్రభుత్వం  నియమించిందని పేర్కొంది. సైన్యాన్ని ఆధునికీకరించేందుకు ఈ మూడు దళాలను సమైక్యపరడం సీడీఎస్ లక్ష్యమని తెలిపింది. జనరల్ రావత్ మరణం వల్ల భారత సైన్యం ఆధునికీకరణ ప్రణాళిక అస్తవ్యస్తమైపోయిందని అంటూ తన అసలు  ఆందోళనను వెల్లడి చేసింది. 

అమెరికాతో లింక్ పెట్టింది 

మరోవంక, ) జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం వెనుక అమెరికా పాత్రకు చైనా లింకు పెట్టింది. ఈ ఘటనపై భారత వ్యూహాత్మక నిపుణుడు బ్రహ్మ చెల్లానీ చేసిన ట్వీట్‌ను చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఈ మేరకు వక్రీకరించింది. అయితే ఈ కథనాన్ని బ్రహ్మ చెల్లానీ ఖండించారు. బిపిన్‌ రావత్‌ మరణం వెనుక బయట వారి ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. 

ఈ  ఘటనపై ఢిల్లీకి చెందిన వ్యూహాత్మక నిపుణుడు, రచయిత బ్రహ్మ చెల్లానీ బుధవారం ట్వీట్‌ చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో తైవాన్ టాప్ మిలిటరీ ఆఫీసర్ జనరల్ షెన్ యి-మింగ్ మరణించిన ఘటనను దీనితో పోల్చారు. 

‘సరిహద్దులో 20 నెలల సుదీర్ఘ చైనా దురాక్రమణ నేపథ్యంలో హిమాలయ ప్రాంతంలో యుద్ధ వాతావరణం ఏర్పడిన సమయంలో, హెలికాప్టర్ ప్రమాదంలో భారత రక్షణ చీఫ్ జనరల్ రావత్, ఆయన భార్య, 11 మంది ఇతర సైనిక సిబ్బంది మరణం విషాదకరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇది జరిగి ఉండాల్సింది కాదు’ అని ట్వీట్‌ చేశారు.

2020 ప్రారంభంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తైవాన్ జనరల్ స్టాఫ్ చీఫ్ జనరల్ షెన్ యి-మింగ్, ఇద్దరు మేజర్ జనరల్‌లతో సహా మరో ఏడుగురు మరణించిన సంగతిని బ్రహ్మ గుర్తు చేశారు. జనరల్ రావత్ హెలికాప్టర్‌ క్రాష్‌ మరణం దీనికి సమాంతరంగా ఉందని పేర్కొన్నారు. 

‘చైనా దూకుడును తీవ్రంగా వ్యతిరేకించిన రక్షణ రంగంలోని కీలక వ్యక్తులు ఈ రెండు ఘటనల్లో మరణించారు’ అని పేర్కొన్నారు. దీనిపై చైనా అధికార పత్రిక గ్లొబల్‌ టైమ్స్‌ తొలుత ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఏడాదిగా చైనా దూకుడుతో పాటు ప్రాదేశిక వివాదాలున్న భారత్‌, తైవాన్‌లో జరిగిన రెండు హెలికాప్టర్‌ ప్రమాద ఘటనల్లో రక్షణ రంగంలోని కీలక వ్యక్తుల మరణం వెనుక బయటి దేశాల ప్రమేయాన్ని బ్రహ్మ చెల్లానీ కొట్టిపారేశారు. 

‘విచిత్రమైన పోలిక ఉన్న రెండు హెలికాప్టర్ క్రాష్‌లకు బయటి హస్తం మధ్య ఏదైనా సంబంధం ఉందని అర్థం కాదు. ఏదైనా ఉంటే, ప్రతి ప్రమాదం ముఖ్యమైన అంతర్గత ప్రశ్నలను లేవనెత్తుతుంది. ప్రత్యేకించి టాప్ జనరల్‌లను రవాణా చేసే సైనిక హెలికాప్టర్ల నిర్వహణ గురించే’ అని ఆయన పేర్కొన్నారు. టాప్ జనరల్స్‌ ప్రయాణాలకు వినియోగించే సైనిక హెలికాప్టర్‌ల నిర్వహణ నాణ్యతను ఆయన సూటిగా ప్రశ్నించారు.

కాగా, బ్రహ్మ చెల్లానీ చేసిన ఈ వ్యాఖ్యలను చైనా అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ వక్రీకరించింది. హెలికాప్టర్‌ క్రాష్‌లో అమెరికా పాత్ర ఉందన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేసినట్లుగా పేర్కొంది. బిపిన్‌ కీలక పాత్ర వహించిన భారత్‌-రష్యా మధ్య ఎస్‌-400 ఒప్పందాన్ని అమెరికా వ్యతిరేకిస్తుండమే దీనికి కారణమని విశ్లేషించింది.

అయితే గ్లోబల్ టైమ్స్ కథనాన్ని బ్రహ్మ చెల్లానీ ఖండించారు. రెండు హెలికాప్టర్ల ప్రమాదాలపై తాను లేవనెత్తిన ప్రశ్నలను అమెరికాతో లింకుపెట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ మేరకు మరో ట్వీట్‌ చేశారు. ‘రష్యా S-400 వ్యవస్థను భారత్‌ కొనుగోలు చేస్తున్నందున, టాప్ ఇండియన్ జనరల్‌ను పొట్టనపెట్టుకున్న హెలికాప్టర్ ప్రమాదం వెనుక అమెరికా ఉందని ఆరోపిస్తూ, చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ (సీసీపీ) మౌత్‌పీస్ నా ట్వీట్‌ను దుర్వినియోగం చేసింది. సీసీపీ వ్యక్తుల చెడ్డ మనస్తత్వాన్ని ఈ ట్వీట్ సూచిస్తుంది’ అని విమర్శించారు.

ఇదిలావుండగా, చైనాకు తైవాన్, భారత దేశాలతో ఘర్షణ, వివాదాలు ఉన్నాయి. జనరల్ రావత్ మాదిరిగానే తైవాన్ మిలిటరీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ షెన్ యి-మింగ్ (62) కూడా గత ఏడాది జనవరిలో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. యూహెచ్-60ఎం హెలికాప్టర్ బయల్దేరిన కాసేపటికే న్యూ తైపేయి సిటీ సమీపంలో  రాడార్‌తో సంబంధాలను కోల్పోయింది. ఈ హెలికాప్టర్లో సిబ్బందితో సహా 13 మంది ప్రయాణించారు. ఫెన్, మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు.