2024 వరకు పిఎంఎవైజి కొనసాగింపు 

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ (పిఎంఎవైజి)ని 2024 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. పిఎంఎవైజిని మార్చి 2021 తరువాత కూడా కొనసాగించాలన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది.
 
 2021 మార్చి 31 నాటికి మొత్తం 2.95 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యమని, లక్ష్యం పూర్తి కానందున 2021 మార్చి తరువాత మిగిలిన 155.75 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. 2021 నవంబర్‌ 29 నాటికి 1.65 కోట్ల ఇళ్లు నిర్మించినట్లు తెలిపింది.
 
కెన్‌-బెత్వా నదుల అంతర్‌ లింకింగ్‌ ప్రాజెక్ట్‌కి నిధులు మంజూరు, అమలు చేయడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కెన్‌-బెట్వా లింక్‌ ప్రాజెక్ట్‌ మొత్తం వ్యయం 2020-21 ధర స్థాయిల ప్రకారం రూ.44,605 కోట్లుగా అంచనా వేశారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి ప్రయోజనం కల్పించే ఈ ప్రాజెక్ట్‌ కోసం రూ.39,317 కోట్ల కేంద్ర మద్దతును కేబినెట్‌ ఆమోదించింది.