హెలికాప్టర్ దుర్ఘటన ప్రమాదమే… మరోకోణం లేదు 

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటన  కేవలం ప్రమాద వశాత్తు జరిగినదని, మరోకోణం ఉండే అవకాశం లేదని ఆర్మీ రిటైర్డ్ డీజీ ఎంవీ కృష్ణారావు స్పష్టం చేశారు.  మేఘాల వల్ల విజిబిలిటీ సున్నాకి పడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. 

హెలికాప్టర్ బయలు దేరిన సమయంలో వాతావరణం అనుకూలంగా ఉందని…అయితే తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు ఉన్నాయని, వర్షం పడకపోయినా మేఘాలు ఉన్నాయని చెప్పారు. విమానాల మాదిరి 30 వేల అడుగుల ఎత్తులో హెలికాప్టర్‌లు ఎగరవని, కేవలం 2వేల అడుగులు ఎత్తులోనే ఎగురుతాయని ఆయన తెలిపారు. 

అనుకోకుండా ఒక మేఘంలోకి ఎంటర్ అవడంతో ఏమి కనిపించక పోవడం హెలికాప్టర్‌కు ఉన్న రోటర్స్‌లో ఒకటి చెట్టుకు తగలడంతో ఒక్కసారిగా కూలిపోయిందని ఆయన వివరించారు. ఎంఐ70 హెలికాప్టర్లు అంత్యంత టెక్నాలజీతో ఉన్న హెలికాప్టర్లని ఆయన చెప్పారు.

ఈ హెలికాప్టర్‌లు కేవలం ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఆర్మీ డీజీలు మాత్రమే ఉపయోగిస్తారని పేర్కొన్నారు. హెలికాప్టర్‌లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, కేవలం వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. బ్లాక్ బాక్స్‌లో ఉన్న సీవీఆర్, డీవీఆర్‌ను డీ కోడింగ్ చేస్తే ప్రమాదానికి కారణం ఏంటి అనేది తెలుస్తుందని పేర్కొన్నారు. 

పైలెట్లు చివరిగా మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ సీవీఆర్‌లో రికార్డ్ అయి ఉంటాయని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సౌందర్య, బాలయోగి వాడిన హెలికాప్టర్లకు ఈ హెలికాప్టర్‌కు చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. 

బిపిన్ రావత్ వాడిన హెలికాప్టర్‌కు రెండు ఇంజిన్లు ఉంటాయని చెబుతూ  ఆ హెలికాప్టర్లకంటే ఇది  చాలా అంత్యంత టెక్నాలజీతో రూపొందని వెల్లడించారు. రెండు రోజుల్లో ప్రమాదానికి సంబంధించిన నివేదిక వస్తుందని, ఆ తరువాత మరికొన్ని విషయాలు బయట పడతాయని కృష్ణారావు పేర్కొన్నారు.

మరోవంక, తమిళనాడులో బిపిన్ రావత్ హెలికాఫ్టర్ కూలడాన్ని ప్రమాదవశాత్తూగా  వైమానిక దళం ప్రకటించింది. అయితే పూర్తి వివరాలు తెలుపలేదు. కాగా హెలికాఫ్టర్‌ ప్రమాదానికి ప్రతికూల వాతావరణంగా పలువురు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో తమిళనాడులో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో అక్కడ కొన్ని రోజులుగా ప్రతికూల వాతావరణం నెలకొంది.

దీనికి తోడు విజిబిలిటీ సమస్య, మానవ తప్పిదం కూడా ఈ ఘోరానికి కారణమై ఉండవచ్చుని విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా సాంకేతిక సమస్య, హెలికాఫ్టరకు ఏమన్నా తీగలు తగిలాయా, రాడార్‌తో అనుసంధానంలో సమస్య తలెత్తిందా, తక్కువ ఎత్తులో ప్రయాణించిందా అన్న వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.