ఒమిక్రాన్‌ వేరియంట్‌ తో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి

ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులతో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత మూడు వారాలుగా అక్కడి రోజువారి కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా పరీక్ష నిర్వహించిన ప్రతి నలుగురిలో దాదాపు ఒకరికి పాజిటివ్‌గా తేలుతోంది.

కరోనా ఇన్‌ఫెక్షన్‌ కేసులు విపరీతంగా పెగడం పట్ల ఆ దేశ అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్‌లు వెలుగు చూసిన తరుణంలో కరోనా  నాలుగోవేవ్‌ కూడా ఊహించినదేనని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడంతోపాటు కరోనా  నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఒమిక్రాన్‌ వెలుగు చూసిన అనంతరం దక్షిణాఫ్రికాలో వైరస్‌ సంక్రమణ అనూహ్య రీతిలో పెరుగుతోంది. గడిచి వారం రోజుల్లోనే కేసుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. రెండు వారాల క్రితం కరోనా  పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా, ప్రస్తుతం అది 25 శాతానికి చేరుకుంది. ఇలా దేశంలో కరోనా  నాలుగోవేవ్‌ ఎదుర్కొంటున్న దశలో ఇన్‌ఫెక్షన్‌ రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్యరంగం నిపుణులు భావిస్తున్నారు.

కొత్తగా బయటపడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ సంక్రమణ, దాని తీవ్రత తెలుసుకునేందుకు దక్షిణాఫ్రికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారని రామఫోసా వెల్లడించారు. వీటితో పాటు ఈ వేరియంట్‌ను వ్యాక్సిన్‌లు ఎంతమేరకు ఎదుర్కొంటాయి? వ్యాధి తీవ్రతకు ఈ వేరియంట్‌ కారణమవుతుందా? అనే కోణంలోనూ నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం , ప్రస్తుతం కేవలం వ్యాక్సిన్‌ మాత్రమే కొత్త ఇన్‌ఫేక్షన్లకు అడ్డుకట్ట వేయగలవని చెబుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా వ్యాధి తీవ్రతను తగ్గించడంతోపాటు ఆస్పత్రుల్లో చేరిక, మరణం ముప్పు నుంచి వ్యాక్సిన్‌లు తప్పిస్తాయని రామఫోసా స్ప ష్టం చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ వేరియంట్‌కు సంబంధించి అదనపు సమాచారం తెలుస్తుందని  ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే దక్షిణాఫ్రికాలో రెండువారాల క్రితం నిత్యం వందల సంఖ్యలో వెలుగుచూసిన పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం పదివేలు దాటింది. డిసెంబర్‌ తొలివారంలో రోజువారి కేసుల సంఖ్య 16వేలకు చేరింది. అక్కడి జాతీయ అంటువ్యాధుల కేంద్రం గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో కరోనా  క్రియాశీల కేసుల సంఖ్య 86వేలు దాటింది. రానున్న మరికొన్ని రోజుల్లోనే ఈ సంఖ్య గణనీయంగా పెరగనున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది.