మధురలో మసీదును హిందువులకు ముస్లింలు అప్పగించాలి

మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయానికి సమీపంలో ఉన్న మసీదును ముస్లింలు హిందువులకు అప్పగించాలని ఉత్తర ప్రదేశ్ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా కోరారు. మధుర, వారణాసిల్లోని తెల్లని నిర్మాణాలు (వైట్ స్ట్రక్చర్స్) హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. 

న్యాయస్థానం సహాయంతో వీటిని తొలగించే సమయం వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ మనోహర్ లోహియా చెప్పిన మాటలను శుక్లా గుర్తు చేశారు. భారత దేశంలోని ముస్లింలు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తమ పూర్వీకులని విశ్వసించాలని, బాబర్, అక్బర్, ఔరంగజేబు దాడులు చేసినవారని గుర్తించాలని లోహియా చెప్పారని తెలిపారు.
బాబర్, అక్బర్, ఔరంగజేబు నిర్మించిన భవనాలను తమవిగా భావించకూడదని లోహియా చెప్పినట్లు ఆయన తెలిపారు. మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి సముదాయంలో ఉన్న వైట్ స్ట్రక్చర్‌ను హిందువులకు అప్పగించడానికి ముస్లింలు ముందుకు రావాలని శుక్లా విజ్ఞప్తి చేశారు. ఈ పని పూర్తి చేసే సమయం వస్తుందని చెప్పారు.
ప్రస్తుతం అయోధ్యలో దివ్యమైన రామాలయం నిర్మితమవుతోందని గుర్తు చేశారు. 1992 డిసెంబరు 6న కర సేవకులు రామ్ లల్లాపై కళంకాన్ని తొలగించారని తెలిపారు.  మాజీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ వసీం రిజ్వీ ఇటీవల సనాతన ధర్మంలోకి మారడం గురించి విలేకర్లు ప్రస్తావించినపుడు శుక్లా స్పందిస్తూ, రిజ్వీని అభినందించారు. 
 
ప్రస్తుత భారతీయు ముస్లింలు సుమారు 250 సంవత్సరాల క్రితం హిందూ మతం నుంచి మారినవారేనని ఆయన చెప్పారు. రిజ్వీ ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఆయన కొనియాడారు. ముస్లింలంతా తిరిగి హిందూ మతంలోకి రావడాన్ని తాము ఇష్టపడతామని తెలిపారు.