నాగాలాండ్‌లో ఉగ్రవాదులనుకొనే సైన్యం కాల్పులు

నాగాలాండ్‌లో ఉగ్రవాదులనుకొనే అస్సాం రైఫిల్స్ జవాన్లు సామాన్యులపై జరిపిన కాల్పులలో 14 మంది పౌరులు చనిపోయిన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ లో ఉభయసభలలో వివరణ ఇచ్చారు. జరిగిన పొరబాటుకు కేంద్రం తీవ్ర పశ్చాత్తాపం ప్రకటిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఘటనపై సిట్ ఏర్పాటు చేశామని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఘటనపై ఆర్మీ ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. దీంతో పాటు సిట్ కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నెల రోజుల్లోగా నివేదిక ఇస్తుందని, బాధ్యులను తప్పకుండా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని భద్రతా బలగాలను హెచ్చరించినట్లు అమిత్ షా తెలిపారు.

ఓటింగ్, మోన్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఆర్మీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో 4వ తేదీన ఆ ప్రాంతాల్లో ఆర్మీ 21 పారా కమాండో యూనిట్ మెరుపు దాడి చేపట్టింది. ఈ క్రమంలో ఓ వాహనం అటుగా వస్తుండగా భద్రతా బలగాలు ఆపమని చెప్పాయి. అయితే వారు ఆగకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించారు.

దీంతో అందులో ఉన్నది ఉగ్రవాదులు అని అనుమానించిన దళాలు, ఆ వాహనంపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో వాహనంలో ఉన్న ఆరుగురు మరణించారు. అయితే ఆ తర్వాత పొరబాటు జరిగిందని గుర్తించిన బలగాలు వాహనంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయని అమిత్ షా వివరించారు.

కాగా,   కాల్పుల విషయం తెలియగానే స్థానిక గ్రామాల ప్రజలు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి దాడి చేశారు. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆత్మ రక్షణ కోసం సైనిక బలగాలు మళ్లీ కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో మరో ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పౌరుల దాడిలో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడు.

ఆ తర్వాత డిసెంబరు 5 సాయంత్రం కూడా స్థానికులు ఆర్మీ ఆపరేటింగ్ బేస్‌పై దాడికి దిగారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు అస్సాం రైఫిల్స్ కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయాడని అమిత్ షా చెప్పారు. ఘటన గురించి తెలియగానే నాగాలాండ్ ఉన్నతాధికారులతో తాను స్వయంగా మాట్లాడానని షా చెప్పారు.

ఘటన జరిగిన ప్రాంతాల్లో శాంతి భద్రతలను అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని, అయితే సామాన్య పౌరులు మృతి చెందడం దురదృష్టకరమని స్పష్టం చేసారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో చింతిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు.