రోశయ్య మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు ప్రజలకు, రాజకీయాలకు తీరని లోటని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.  అపర రాజకీయ చాణక్యున్ని కోల్పోయామని పేర్కొన్నారు. రోశయ్య ఆర్థిక నిపుణుడు, అద్భుత మేధావి అని కొనియాడారు. 

తాను శాశనసభ చూడాలనుకున్నపుడు మొదట రోశయ్యనే చూశానని చెబుతూ  రామారావు, రోశయ్య చాలా సన్నిహితంగా ఉండేవారని తెలిపారు. తాను విద్యార్థి దశ నుంచే ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు అసెంబ్లీలో కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు.

తాను బీజేపీ పక్ష నేతగా ఉన్నపుడు రోశయ్య శాశనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. రాజకీయ శత్రువులుగా కాకుండా ప్రత్యర్థులుగా ఉండేవాళ్ళమని పేర్కొన్నారు. అసెంబ్లీ లోపల, బయట వైఎస్‌కు రోశయ్య కవచంలా ఉండేవారని చెప్పారు. రోశయ్య సీఎంగా ఉన్నపుడు కూడా తమకు చాలా సమయం ఇచ్చేవారని, ఆయన కుటుంబతో తమకు చాలా దగ్గరి సంబంధం ఉందని కిషన్ రెడ్డి చెప్పాన్నారు.

 మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తెలుగు రాజకీయలు ఉన్నంత కాలం రోశయ్య జీవించి ఉంటారని చెప్పారు. ఆర్థిక మంత్రి అంటే మెదట గుర్తొచేది రోశయ్యేనని ఆయన పేర్కొన్నారు. 

అవినీతి మరకలేని వ్యక్తి అని, రాజకీయాల్లో రోశయ్య నిజాయితీ పరుడని బండి సంజయ్ కొనియాడారు.  ఆయనను తాను ఎప్పుడు కలవక పోయినప్పటికీ బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు, అసెంబ్లీలో ఉన్నప్పుడు టీవీల్లో చూసేవాడిని అని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీకి ఆయన ఎన్నో సేవలు అందించారని తెలిపారు.