ఏపీకి ఎన్జీటీ రూ 120 కోట్ల జరిమానా

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏపీ ప్రభుత్వానికి  నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ రూ.120కోట్ల భారీ జరిమానా విధించింది. పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చేపట్టినందుకు కూడా జరిమానా గ్రీన్‌ ట్రైబ్యునల్‌ జరిమానా వేసింది.

పురుషోత్తంపట్నంకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90కోట్లు, చింతలపూడికి రూ.73.6 కోట్లు జరిమానా విధించింది. పర్యావరణ ఉల్లంఘనలపై సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్‌ ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. 

జరిమానాను మూడు నెలల్లోగా చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది.  ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) సభ్యులతో కమిటీ నియమించి జరిమానా నిధుల వినియోగంపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశాల్లో వెల్లడించింది.

చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 3నెలల్లోగా అనుమతులు తెచ్చుకోవాలని, ఒకవేళ అనుమతులు రాకపోతే ప్రాజెక్టు పనులు 3నెలల తర్వాత ఆపేయాలని ఆదేశించారు. పోలవరం కుడి కాలువను విస్తరించి ప్రకాశం బ్యారేజీ మీదుగా బానకచర్ల క్రాస్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ నుంచి చేపడుతున్న గోదావరి–కృష్ణా–పెన్నా నదుల లింక్ ప్రాజెక్టు పనులు ఆపేయాలని తేల్చిచెప్పారు.