సీఎం సీటు కోసం ప్రగతి భవన్ లో కొట్లాట

సీఎం సీటు కోసం ప్రగతిభవన్లో కుటుంబ సభ్యుల మధ్య  కొట్లాట జరుగుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తమను సీఎం ఎప్పుడు చేస్తావని కొడుకు, బిడ్డ, అల్లుడు కేసీఆర్ ను అడుగుతున్నారని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ  తెలిపారు. అందుకే ఉన్నన్ని రోజులు తానే సీఎంగా ఉండాలని  కేసీఆర్ కోరుకుంటున్నాడని పేర్కొన్నారు.  

సీఎం సీటు కోసం కొడుకు, బిడ్డ, అల్లుడిని రెచ్చగొడుతూ కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.  ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతును గెంటేస్తున్నారని ధ్వజమెత్తారు. దీనికి ఉదాహరణ ఈటల రాజేందర్ అని తెలిపారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ లో స్థానం లేదనే రాజేందర్  లాంటి వాళ్లను బయటకు పంపుతున్నారని చెప్పారు. 

తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని, నియంత, కుటుంబ పాలన కొనసాగుతోందని సంజయ్ దుయ్యబట్టారు.   ప్రజల ద్రుష్టి మళ్లించడానికి  కేసీఆర్ కుట్ర చేస్తున్నారని హెచ్చరించారు. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయిండో అర్ధం కాలేదని చెబుతూ అపాయిట్ మెంట్ ఇవ్వలేదనే సాకుతో ఆత్మగౌరవం సెంటిమెంట్ ను రాజేద్దామనుకున్నాడని ధ్వజమెత్తారు. 

అపాయిట్ మెంట్ అడగనేలేదని పీఎంవో చెప్పడంతో కేసీఆర్ కుట్ర ప్రజలకు అర్ధమైందని చెప్పారు. సొంత పనుల కోసం ఢిల్లీకి పోయిన కేసీఆర్  అపాయిట్ మెంట్ పేరుతో బీజేపీని అప్రతిష్టపాల్జేయాలని కుట్ర చేశాడని విమర్శించారు. కేసీఆర్ కు రాజకీయ పతనం మొదలైనట్లు .. ఓ జ్యోతిష్కుడు చెప్పాడని తెలిపారు. 

ప్రజలు చీదరించినా, చీత్కరించినా బీజేపీని నవ్వులపాలు చేయాలనే నీచమైన కుట్రకు   కేసీఆర్   పాల్పడ్డారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే తెలంగాణ తల్లికి విముక్తి కాబోతుందని, బీజేపీతోనే అది సాధ్యం కాబోతుందని భరోసా వ్యక్తం చేశారు. అందుకోసం రక్తాన్ని ధారపోయాల్సి ఉంటుందని పార్టీ కార్యకర్తలకు తెలిపారు. 

త్యాగాలకు మీరు సిద్ధమా? రక్తాన్ని ధారపోసేందుకు ప్రజలంతా సిద్ధమైతే.. గడీల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించే బాధ్యత తనదని సంజయ్ స్పష్టం చేశారు. 

 వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అన్ని వ్యవస్థలను టీఆర్‌ఎస్‌ నాశనం చేసిందని విమర్శించారు. డిసెంబర్ 17 నుంచి మళ్లీ పాదయాత్ర మెదలు పెట్టనున్నట్లు తెలిపారు. బీజేపీ పాదయాత్రతో టీఆర్ఎస్ పతనం మెదలైందని సంజయ్‌ పేర్కొన్నారు.