పెట్రోల్, డీజిల్ వాహనల నిషేధం ప్రసక్తి లేదు 

దేశంలో విద్యుత్ వాహనాల వినియోగంను ప్రోత్సహించేందుకు పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధిస్తున్నట్లు, వాటి రిజిస్ట్రేషన్లు నిలిపి వేస్తున్నట్లు వస్తున్న కథనాలను కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ త్రోసిపుచ్చారు. 
 
కేవలం విద్యుత్ వాహనాలను ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ వాహనాలను కొనుగోలు చేయడానికి అమ్మకాలను ప్రోత్సాహిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. అలాగే, విమానయాన ఇంధనంలో 50 శాతం ఇథనాల్ వాడకాన్ని ప్రోత్సహించడానికి కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నందున ఈవీల అమ్మకాలు పెరిగాయని మంత్రి తెలిపారు. 

“మేము విద్యుత్ వాహనాలు తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను” అని గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో 250 పైగా స్టార్టప్‌‌‌‌లు ఎలక్ట్రిక్-వాహనాల అభివృద్ది కోసం పనిచేస్తున్నాయని, దీంతో ఈవీల తయారీ ఖర్చు తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 గ్రీన్ హైడ్రోజన్ భవిష్యత్తు అని పేర్కొన్న ఆయన వచ్చే నెలలో ఒక హైడ్రోజన్‌ కారు కొనబోతున్నట్లు కూడా వెల్లడించారు. 2019లో దేశంలో విద్యుత్  వాహనాల అమ్మకాలను ప్రోత్సహించడానికి 2025 నాటికి విద్యుత్  త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల వాడకాన్ని నిషేదించే ఒక ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. 

అయితే, ఆటో మొబైల్ కంపెనీలు ఈ ప్రతిపాదనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగంపై నిషేధం వల్ల గ్రీన్ ఎనర్జి వాహనాల అమ్మకాలు పెరగవని పేర్కొన్నాయి. 2030 నాటికి అనేక దేశాలు ఐసీఈ వాహనాలను నీషేదిస్తుండటంతో,  భారత్ మాత్రం ప్రస్తుతానికి ఆ వైపు ఆలోచనలు ఏవి చేయడం లేదని ఆయన తెలిపారు. 

అయితే, వివిధ ప్రోత్సాహకాలు, పథకాలను అందించడం ద్వారా ఆటోమొబైల్స్ అమ్మకాల్లో గ్రీన్ ఎనర్జి వాహనాల శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 విధానం కింద సబ్సిడీలను అందిస్తున్నప్పటికీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీ ప్రయోజనాలను అందించడంతో విద్యుత్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి.