తడిసి రంగు మారి రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న వడ్లు 

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మీనమేషాలు లెక్కిస్తూ, కేంద్రంపై ఆరోపణలు చేస్తూ రైతుల నుండి వడ్లు కొనుగోలులో జాప్యం చేస్తుండడంతో ముంచుకొచ్చిన వర్షాలకు అవి తడిసి, రంగు మారి రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. వడ్లు తడిసి మొలకెత్తుతున్నయ్. మడికట్లల్ల, కల్లాల్లో, రోడ్ల పొంట, కొనుగోలు సెంటర్లలో ఏ కుప్ప మీది పట్టా తీసి చూసినా మొలకలే కనిపిస్తన్నయ్.

తుఫాన్​ ప్రభావం రాష్ట్రంపై ఉంటదని, అన్ని జిల్లాల్లో వర్షాలు పడ్తాయని వాతావరణశాఖ ముందే హెచ్చరించినా రాష్ట్ర సర్కారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎక్కడా కొనుగోళ్లను వేగవంతం ​ చేయలేదు. కనీసం రైతులకు పూర్తిస్థాయిలో టార్పాలిన్లు కూడా ఇవ్వలేదు. వడ్లలో తేమ ఎక్కువగా వస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము దింపుకోబోమని మిల్లర్లు చెప్తున్నారు. దీంతో రెండు రోజులుగా మెజారిటీ సెంటర్లలో ప్రభుత్వం కొనుగోళ్లు బంద్​పెట్టింది. 

తడిసిన కుప్పల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నరు. కొన్నిచోట్ల ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నరు. పోలీసులతో ఎక్కడిక్కడ రైతుల ఆందోళనలను అడ్డుకోవడం తప్ప ఎక్కడా అధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ కొనుగోళ్లు వేగం​గా జరిగేలా చర్యలు తీసుకోవడం లేదు. 

ఈ వానాకాలం సీజన్​లో 6,821 కొనుగోలు సెంటర్ల ద్వారా కోటి 4 లక్షల టన్నుల వడ్లు కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ కొనుగోళ్లు ప్రారంభించి నెల దాటుతున్నా  ఇప్పటివరకు 14 శాతమే కొన్నారు. 5 వేలకు పైగా సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభించామని పౌరసరఫరాల అధికారులు చెప్తున్నా అందులో సగం సెంటర్లలో కూడా కాంటాలు పెట్టట్లేదు. 

ఆసిఫాబాద్​, మంచిర్యాల, ములుగు, నాగర్‌‌ కర్నూల్‌‌, గద్వాల జిల్లాల్లోనైతే ఇప్పటికీ  ఒక్క సెంటర్​ కూడా ప్రారంభించలేదు. ఇక ఆదివారం వరకు భూపాలపల్లి జిల్లాలో 185 సెంటర్లకుగాను 22, మహబూబాబాద్​ జిల్లాలో 188 సెంటర్లకుగాను 27, వికారాబాద్​లో 146 సెంటర్లకుగాను  11 మాత్రమే ప్రారంభించారు. వాటిలోనూ సగానికిపైగా కేంద్రాల్లో కాంటాలు పెట్టట్లేదు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం14.84 లక్షల టన్నుల వడ్లే  కొనుగోలు చేశారు.

వానల వల్ల చాలా కొనుగోలు సెంటర్లలో, కల్లాల్లో వడ్లు తడిశాయి. చాలా మంది రైతులు ప్రభుత్వం నుంచి టార్పాలిన్లు కూడా అందకపోవడంతో కిరాయికి తెచ్చుకుని కుప్పల మీద కప్పుకున్నారు. అయినప్పటికీ కుప్పల కిందికి వాన నీళ్లు పారడంతో వడ్లు తడిసిపోయాయి. వారం రోజుల నుంచి మబ్బులు, వర్షాల కారణంగా చాలా మంది రైతులు కుప్పలపై పట్టాలు తొలగించే సాహసం చేయలేదు. 

సోమవారం కాస్త వాన గెరువు ఇచ్చి, ఎండ పొడ రావడంతో వడ్లు ఆరబోసేందుకు పట్టాలు తొలగించగా.. మొలకెత్తిన వడ్లు కనిపించాయి. వడ్లలో తేమ 17 శాతం మించి వస్తుండడంతో ఇదే అదనుగా మిల్లర్లు వడ్ల లోడ్లను దింపుకోవట్లేదు. తడిసిన వడ్లు మరాడిస్తే నూక వచ్చి నష్టపోతామని, మరో వారం పది రోజుల దాకా వడ్లను పంపవద్దని మిల్లర్లు చెప్తున్నారు. దీంతో సెంటర్లలో కాంటాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. 

పెద్దపల్లి జిల్లాలో 200 సెంటర్లు ఓపెన్​కాగా,  వడ్లలో తేమ ఎక్కువగా వస్తోందంటూ రెండ్రోజుల నుంచి కొనుగోళ్లు బంద్​పెట్టారు. కాల్వ శ్రీరాంపూర్, ముత్తారం, ఎలిగేడు లాంటి మండలాల్లోని ఐకేపీ సెంటర్లు 90 శాతం బంద్ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 289 సెంటర్లు ఓపెన్​ కాగా సోమవారం ఏ సెంటర్​లోనూ కాంటా పెట్టలేదు. 

సిద్దిపేటలోనూ తేమ ఎక్కువగా ఉందని సోమవారం 27 సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు ఆపేశారు. తేమ శాతం ఎక్కువగా వస్తోందని జనగామ జిల్లాలో టోకెన్లు బంద్​పెట్టారు. ఆది, సోమవారాల్లో 22 జిల్లాల్లో ఆఫీసర్లు కాంటాలు నిలిపివేశారు. ఆదివారం కేవలం 10 జిల్లాల్లో నామమాత్రంగా 44 వేల టన్నులు కొనుగోలు చేశారు. 

రైస్​మిల్లర్ల కోసమే కాంటాలు బంద్​పెట్టారని ఆయా చోట్ల రైతులు ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారు. కరీంనగర్​, మెదక్​, జనగామ, యాదాద్రి, సూర్యాపేట తదితర జిల్లాల్లో సోమవారం ఆందోళనకు దిగారు. తేమతో సంబంధం లేకుండా వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. 

సూర్యాపేట జిల్లాలో 333 సెంటర్లకు గాను 119 సెంటర్లలో తేమ పేరుతో కొనుగోళ్లు బంద్​పెట్టిన్రు.  ఇప్పటివరకు1,646 మంది రైతుల వద్ద వడ్లు కొన్నరు. వీరిలో 1,200 మంది రైతుల వద్ద కొన్న వడ్లలో తేమ17శాతం కంటే ఎక్కువగా ఉందనే  కారణంతో మిల్లర్లు వడ్లను అన్​లోడ్​ చేసుకోవట్లేదు. దీంతో ఆయా ట్రాక్టర్లు హుజూర్​నగర్​లోని మిల్లుల ముందు బారులు తీరినయ్​. 

నిర్మల్​ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని గొల్లమడ కొనుగోలు కేంద్రంలో పరిస్థితి ఇది. సోమవారం కురిసిన వర్షానికి ఈ ఒక్క సెంటర్​లోనే  దాదాపు 50 లారీల ధాన్యం తడిసింది.  పైనుంచి వర్షం.. కింది నుంచి వరద కారణంగా వడ్లు కొట్టుకుపోగా వాటిని ఎత్తుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డరు.