పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంప్‌పై గ్రనేడ్‌ దాడి

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఉన్నధీర్‌పుల్ ఏరియా ఆర్మీక్యాంప్‌ సమీపంలో పేలుళ్లు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున ఆర్మీక్యాంప్‌ సమీపంలోని త్రివేణి గేట్‌ వద్ద గ్రనేడ్‌ పేలుడు సంభవించింది. 
 
దీంతో అప్రమత్తమైన సైన్యం ఆ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రనేడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిందెవరనే అంశాన్ని సీసీటీవీలో పరిశీలిస్తున్నారు.
 
పెళ్లి ఊరేగింపు ఒకటి ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు గ్రనేడ్ విసిరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం అందలేదు. 
 
ఘటనా స్థలి నుంచి గ్రెనేడ్ అవశేషాలను స్థానిక పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై తదుపరి దర్యాప్తు సాగిస్తున్నట్టు పఠాన్‌కోట్ ఎస్ఎస్‌పీ సురేంద్ర లంబా తెలిపారు. పఠాన్‌కోట్‌లో గ్రెనేడ్‌ దాడి నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
జమ్మూ-పఠాన్‌కోట్ హైవేపై పలు చోట్ల భద్రతా బలగాలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాయి. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
ఈ ఏడాది జూన్‌లో అత్యంత పటిష్ట భద్రత నడుమ ఉంటే జమ్ము ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. డ్రోన్‌తో ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో దుండగులు దాడిచేశారు. ఇందులో ఇద్దరు సైనికులు గాయపడ్డారు