గతుకుల రహదారిలో  భారత్-చైనా సంబంధాలు

భారత్-చైనా మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో ఉన్నాయని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ తెలిపారు. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కొన్ని చర్యలను చైనా చేపట్టిందని, అందుకు ఆ దేశం వద్ద ఇప్పటికీ విశ్వసనీయమైన వివరణ లేదని ఆయన ధ్వజమెత్తారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నదీ చైనా నాయకత్వమే చెప్పాలని స్పష్టం చేశారు. 

సింగపూర్‌లో జరిగిన ‘‘గ్రేటర్ పవర్ కాంపిటీషన్ : ది ఎమర్జింగ్ వరల్డ్ ఆర్డర్’’ చర్చా కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానంగా జైశంకర్ మాట్లాడుతూ, భారత్-చైనా సంబంధాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి చైనా నాయకత్వానికి ఏదైనా సందేహం ఉన్నట్లు తాను భావించడం లేదని చెప్పారు. 

తన వల్ల సక్రమంగా జరగనిది ఏమిటో కూడా ఆ దేశ నాయకత్వానికి తెలుసునని తెలిపారు. తాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతోఅనేకసార్లు సమావేశమయ్యానని తెలిపారు. తాను అత్యంత స్పష్టంగా, సమంజసంగా మాట్లాడానని చెప్పారు. అటువైపు నుంచి స్పష్టత లేదని పేర్కొన్నారు. 

తూర్పు లడఖ్‌లో చైనాతో ఘర్షణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, భారత్-చైనా మధ్య అమలవుతున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా కొన్ని చర్యలు చేపట్టినందువల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు గతుకుల రహదారిలో నడుస్తున్నాయని చెప్పారు. ఈ ఉల్లంఘనలకు ఇప్పటికీ చైనా వద్ద సరైన, విశ్వసనీయమైన వివరణ లేదని తెలిపారు. 

తూర్పు లడఖ్‌లో భారత్-చైనా ఘర్షణలు గత ఏడాది మే 5న ప్రారంభమయ్యాయి. గత ఏడాది జూన్ 15న గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికులు తలపడ్డారు. ఇరు దేశాలు క్రమంగా తమ సైనిక, ఆయుధ సామర్థ్యాలను పెద్ద ఎత్తున మోహరించాయి. అనేక దఫాల చర్చల అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాల సైన్యాలు పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి వెనుకకు వెళ్ళాయి. ఇరు దేశాలు గోగ్రా ప్రాంతం నుంచి తమ సైన్యాలను ఆగస్టులో ఉపసంహరించుకున్నాయి. 

తలసరి ఆదాయం తక్కువైనా… 

కాగా, భారత తలసరి ఆదాయం 2000 డాలర్లకన్నా తక్కువైనప్పటికీ డిజిటల్ టూల్స్,గొప్ప ఉత్పత్తి సామర్థ్యం కారణంగా వేలాది కరోనా చికిత్సా కేంద్రాలను తెరచి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచామని జైశంకర్ తెలిపారు. కరోనా మహమ్మారి భారత్‌కు వ్యాపించినప్పుడు వెంటిలేటర్లు అసెంబుల్ చేసే కంపెనీలు రెండే ఉండేవని, ఎన్95 మాస్కులను తయారుచేసే కంపెనే లేదని, అతి తక్కువ వైద్య పరికరాలుండేవని పేర్కొన్నారు. 

కరోనా తర్వాత ఆరోగ్య మౌలికవసతులు భారీగా పెరిగాయని తెలిపారు. ‘‘వ్యాక్సిన్ పరంగాకాక మొత్తం ఫార్మా రంగంను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు నాడు భారత్ హైడ్రోక్లోరిక్విన్‌కు, పారాసిటిమాల్‌కు చాలా డిమాండ్ ఏర్పడింది. దాంతో మేము వివిధ ఔషధాలను పది రెట్లు, ఇరవై రెట్ల వరకు ఉత్పత్తి పెంచాము” అని వివరించారు.