గాడిలో పడుతున్న దేశ ఆర్ధిక వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో పాటు  ఇప్పుడు గాడిలో పడినట్లు అనేక సూచికలు తెలియజేస్తున్నాయని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. అయితే వృద్ధి నిలదొక్కుకుని, తన సామర్థ్యానికి తగిన స్థాయికి చేరుకోవాలంటే ప్రైవేటు పెట్టుబడులు తిరిగి పుంజుకోవాలని ఆయన తెలిపారు.

ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటే కరోనా మహమ్మారి తర్వాత సమంజసమైన అధిక వేగంతో వృద్ధి చెందే సామర్థ్యం భారత దేశానికి ఉందని ఆయన పేర్కొన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనమిక్స్ కాంక్లేవ్, 2021లో ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ల విషయంలో సాధించిన ప్రగతి మన దేశ శాస్త్రీయ సామర్థ్యాలకు అద్భుతమైన ఉదాహరణ అని కొనియాడారు. 

కాంటాక్ట్-ఇంటెన్సివ్ సర్వీసెస్ కోల్పోయిన వేగాన్ని తిరిగి పొందవలసి ఉందని చెప్పారు. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల మధ్య చెప్పుకోదగ్గ అంతరం ఉన్నట్లు తొలి త్రైమాసికంలోని జీడీపీ డేటా వెల్లడించిందని తెలిపారు. కరోనా మహమ్మారికి ముందునాటి పరిస్థితికి చేరుకునేలా వృద్ధి చెందాలంటే నిలకడగా ప్రేరణ ఉండాలని తెలిపారు. 

స్టార్టప్ వ్యాపార రంగంలో మన దేశం టాప్ పెర్ఫార్మర్‌గా ఉందని చెప్పారు. పెట్టుబడులకు అనువైన సమయం వచ్చినపుడు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉండాలని బ్యాంకులను కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెట్టుబడులకు అనువైన సమయం వస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 

జూన్ స్థాయితో పోల్చితే సెప్టెంబర్‌లో బ్యాంకుల స్థూల ఎన్‌పిఎ మరింత మెరుగుపడిందని దాస్ తెలిపారు. బ్యాంకులు తమ మూలధన నిర్వహణ ప్రక్రియను మెరుగుపరచుకోవాలని ఆయన గట్టిగా కోరారు. క్రిప్టోకరెన్సీ గురించి అడిగినప్పుడు, దాస్ మాట్లాడుతూ, అంతర్గత చర్చల తర్వాత క్రిప్టోకరెన్సీ నుండి స్థూల ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనలు ఉన్నాయని,  లోతైన చర్చలు అవసరమని చెప్పారు.

కాగా, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే క్లెయిమ్‌లతో ఆకర్షించడానికి,  ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఇటువంటి కరెన్సీలు ఉపయోగించబడుతున్నాయని ఆరోపించిన ఆందోళనల మధ్య నవంబర్ 29 నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో ప్రభుత్వం క్రిప్టోకరెన్సీలపై బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం, దేశంలో క్రిప్టోకరెన్సీల వాడకంపై ప్రత్యేక నిబంధనలు లేదా నిషేధం ఏవీ లేవు.