లెజెండ్స్ క్రికెట్ లీగ్ కమిషనర్‌గా రవిశాస్త్రి

 
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. వచ్చే ఏడాది జనవరినుంచి ప్రారంభం కానున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్ (ఎల్‌ఎల్‌సి)కు కమిషనర్‌గా వ్యవహరించనున్నాడు. 
 
‘వివిధ దేశాల క్రికెట్ లెజెండ్స్‌తో కలిసి పని చేసే అవకాశం లభించడం గొప్ప విషయం. లెజెండ్స్ క్రికెట్ లీగ్‌లో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదో ప్రత్యేకమైన టోర్నమెంట్’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 
 
ఈ లీగ్‌లో దిగ్గజ ఆటగాళ్లు మరోసారి మైదానంలో తలపడనున్నారు. కొత్తగా వాళ్లు నిరూపించుకోవడానికి ఏమీ లేకపోయినా వాళ్లు ఆడుతుంటే చూడడం అభిమానులకు గొప్ప అనుభూతినిస్తుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఈ లీగ్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలకు చెందిన మాజీ దిగ్గజక్రికెటర్లు పాల్గొననున్నారు. 
 
భారత్ ఆసియా, రెప్ట్ ఆఫ్ ది వరల్డ్ పేర్లతో మూడు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత టి20 ప్రపంచకప్ టోర్నమెంట్‌తో టీమిండియా హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి పదవీ కాలం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. త్వరలో న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న టి20 సిరీస్‌తో రాహుల్ ద్రావిడ్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో లేని భారత్ 

టి 20 ప్రపంచకప్ 2021లో ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించి ఆస్ట్రేలియా తొలి సారిగా ప్రపంచకప్‌ను గెలుపొందగా,  సిసి 11 మంది ఆటగాళ్లతో కూడిన టి20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. 
 
ఈ జట్టులో ఆరు దేశాలకు చెందిన జట్ల ఆటగాళ్లకు స్థానం లభించింది. టీమిండియాకు చెందిన ఒక్క ఆటగాడికి కూడా ఈ జట్టులో చోటు లభించలేదు. చాంపియన్స్ ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ , సెమీఫైనలిస్టులు పాకిస్థాన్, ఇంగ్లండ్, అదేవిధంగా శ్రీలంక, దక్షిణాఫ్రికాకు ఆటగాళ్లను ఎంపిక చేశారు.
 
పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజమ్‌ను ఈ జట్టుకు కెప్టెన్‌గా సెలెక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్‌లకు ఓపెనర్లుగా స్థానం లభించింది.