జాతీయ క్రికెట్ అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌

జాతీయ క్రికెట్ అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ నియామ‌కం కానున్నారు. వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ నియామ‌కాన్ని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ధృవీక‌రించారు. త్వ‌ర‌లోనే ఎన్‌సీఏ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తార‌ని గంగూలీ తెలిపారు. 

ఇప్పటి వరకు ఎన్‌సిఏ డైరెక్టర్ గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌  టీమ్‌ ఇండియా కోచ్‌గా బిసీసీఐ నియమించడంతో, ఖాళీ అయిన ఆ స్థానానికి వివిఎస్‌ లక్ష్మణ్‌ను ఎంపిక చేసింది. భారత్ లో  క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు మాజీ క్రికెటర్లను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భావిస్తున్నారు.

రాహుల్ ద్రవిడ్‌ను భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉండేలా గంగూలీ అంగీకరింపచేశారు. తొలుత ఈ బాధ్యతలు చేపట్టేందుకు లక్ష్మణ్‌ నిరాకరించాడని సమాచారం. అయితే గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జైషా చర్చలు జరిపిన తర్వాత లక్ష్మణ్‌ అంగీకరించారని తెలుస్తున్నది.

మరో వైపు రాహుల్‌ ద్రవిడ్‌ విషయంలోనూ ఇదే జరిగింది. టీమ్‌ ఇండియా కోచ్‌ బాధ్యతలను తీసుకునేందుకు రాహుల్‌ తిరస్కరించగా,  గంగూలీ ఒప్పించారని వార్తలు వచ్చాయి. రాబోయే రెండు, మూడేళ్లలో టీమిండియా టి20 ప్రపంచకప్‌ 2022తో పాటు టెస్టు చాంపియన్‌ షిప్‌, వన్డే ప్రపంచకప్‌ టోర్నీలు ఆడనుంది. క్రికెట్‌ దిగ్గజాలు ఉన్నత పదవులను ఇవ్వడంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.