కేబీఆర్‌ పార్క్‌ వద్ద సినీ నటిపై దుండగుడి దాడి

హైదరాబాద్ లోని  కాసు బ్రహ్మానందరెడ్డి ( కేబీఆర్) పార్కులో టాలీవుడ్ నటి, మోడల్ షాలూ చౌరాసియాపై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఈ పార్కులో జాగింగ్ చేస్తోన్న ఆమెపై ఓ దుండగుడు దాడికి తెగబడ్డాడు. 

ఊహించని చర్యకు బిత్తరపోయిన నటి.. భయంతో కేకలు వేసింది.  తనపై జరగుతున్న దాడికి అడ్డుకునేందుకు దుండగుడితో నటి పెనుగులాడటంతో.. స్వల్పంగా గాయాలయ్యాయి.  చివరికి దుండగుడు నటి సెల్ ఫోన్ తీసుకుని పరారయ్యాడు. 

గాయాలతోనే పార్కు బయటికి వచ్చి నటి.. అక్కడున్నవారి సహాయంతో 100 నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇచ్చింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం రాత్రి 8.30 సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. 

ఈ దాడిలో నటి చౌరాసియా తలకు, కాళ్లకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తన ముఖంపై పిడిగుద్దులతో గుద్ది, బండరాయితో ఆమెపై దాడి చేసే యత్నం చేశాడని నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను నగలు, నగదు ఇవ్వాలని కూడా దుండగుడు డిమాండ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిసిటివి కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ దుండగుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నటిని దగ్గరలోని ఆసుప్రతికి తరలించారు.  ‘ఓ పిల్లా నీల్ల’, ‘అరణ్యంలో’ సినిమాల్లో ఆమె నటించింది.