మావోయిస్టు అగ్రనేతలు ప్ర‌శాంత్ బోస్, షీలా మ‌రాండి అరెస్ట్?

మావోయిస్టు పార్టీ అగ్ర నాయ‌కులు ప్ర‌శాంత్ బోస్ , ఆయ‌న భార్య శీలా మ‌రాండిని జార్ఖండ్ పోలీసులు శుక్ర‌వారం అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తున్నది. ప్ర‌శాంత్ బోస్ మావోయిస్టు సీనియ‌ర్ నాయ‌కుల‌లో ఒక‌రు. మావోయిస్టు క‌మ్యూనిస్ట్ సెంట‌ర్ ఆఫ్ ఇండియా (ఎంసిసిఐ) అధినేతగా ప్ర‌శాంత్ బోస్ కొన‌సాగారు. 

ప్ర‌శాంత్ బోస్ భార్య షీలా మ‌రాండీ కూడా మావోయిస్టు పార్టీలో అగ్ర నాయ‌కురాలు. వీరిద్ద‌రిని జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. 75 ఏండ్ల ప్ర‌శాంత్ బోస్ గ‌త కొంత‌కాలం నుంచి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌శాంత్ బోస్ ప్ర‌స్తుతం సీపీఐ మావోయిస్టు సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్‌, పొలిట్‌బ్యూరో, సెంట్ర‌ల్ మిల‌ట‌రీ క‌మిష‌న్, ఈస్ట్ర‌న్ రీజిన‌ల్ బ్యూరో సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతున్నారు.

ఈశాన్య రాష్ట్రాలతో  పాటు బీహార్, జార్ఖండ్‌, బెంగాల్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో విప్ల‌వోద్య‌మాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ బోస్ జార్ఖండ్‌లోని స‌రందా అడ‌వుల నుంచి పార్టీ కార్య‌క‌లాపాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఆయన బోస్ పశ్చిమ బెంగాల్‌లోని జాద‌వ్‌పూర్‌కు చెందిన‌వారు. బోస్‌ను కిష‌న్ దా అలియాస్ నిర్భ‌య్, కిష‌న్, కాజ‌ల్, మ‌హేశ్‌గా పిలుస్తారు.

కిష‌న్ దా భార్య షీలా మ‌రాండీ ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ క‌మిటీ మెంబ‌ర్‌గా కొన‌సాగుతున్నారు. ఒడిశాలో 2006లో ఆమె అరెస్టు అయ్యారు. రూర్కీలా జైల్లో శిక్ష అనుభ‌వించిన అనంత‌రం ఆమె విడుద‌ల‌య్యారు.  ఐదేండ్ల క్రితం ఆమె తిరిగి సీపీఐ పార్టీలో చేరారు. షీలా మరాండీ జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్ జిల్లాకు చెందిన‌వారు. ఆమెను హేమ‌, ఆశా, భుదానిగా పిలుస్తారు.

ఇలా  ఉండగా, ఛ‌త్తీస్‌గ‌ఢ్ లోని కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. పోలీసు ఇన్‌ఫార్మ‌ర్ నెపంతో మావోయిస్టులు ఓ యువ‌కుడిని హ‌త్య చేశారు. మృతుడిని గ‌ట్ట‌గ‌ల్‌కు చెందిన దినేశ్ నూరేటిగా పోలీసులు గుర్తించారు. గ‌ట్ట‌గ‌ల్‌లో ఆదివాసీల స‌మ‌క్షంలో ప్ర‌జాకోర్టు నిర్వ‌హించి, దినేశ్‌ను మావోయిస్టులు హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.