సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకంపై నిషేధం 

హిందుత్వ వాదాన్ని ఇస్లామిక్ తీవ్ర‌వాదంతో పోలుస్తూ కాంగ్రెస్ నేత స‌ల్మాన్ ఖుర్షీద్ రాసిన స‌న్‌రైజ్ ఓవ‌ర్ అయోధ్య‌: నేష‌న్‌హుడ్ ఇన్ అవ‌ర్ టైమ్స్ పుస్త‌కంపై నిషేధం విధించ‌నున్న‌ట్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంశాఖ మంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా వెల్లడించారు. న్యాయ నిపుణుల‌ను సంప్ర‌దించిన త‌ర్వాత‌, ఆ పుస్త‌కాన్ని నిషేధిస్తామ‌ని తెలిపారు.  ఖుర్షిద్ రాసిన పుస్తకం  ఖండించదగినదని స్పష్టం చేస్తూ   హిందువులను విభజించే లేదా మన దేశాన్ని విభజించేలా మాట్లాడే వారిపై మంత్రి విరుచుకుపడ్డారు.

‘భారత్ తుక్డే హోంగే’ అన్న వారి వద్దకు రాహుల్ గాంధీ మొదట వెళ్లలేదా? అందుకే రాహుల్ ఎంజెండాలో సల్మాన్ ఖుర్షీద్ పని చేస్తున్నారని మిశ్రా ఆరోపించారు. మహాన్ భారత్ కాదు బద్నామ్ భారత్ అని మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ వ్యాఖ్యానించారని మిశ్రా గుర్తు చేశారు. 

హిందూత్వ అనేది ఒక జీవన విధానం అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని, అలాంటప్పుడు ప్రశ్నించడానికి ఏముందని మిశ్రా నిలదీశారు. .రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో సహా వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా, ముస్లిం ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తుందని మంత్రి ఆరోపించారు.

ఇస్లామిక్ ఉగ్ర‌వాద గ్రూపులు ఐఎస్‌, బోకోహ‌ర‌మ్ త‌ర‌హాలో హిందుత్వ వాదం ఉన్న‌ట్లు ఖ‌ర్షీద్ త‌న పుస్త‌కంలో వ్రాయడం ప‌ట్ల బీజేపీ తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసింది. హిందువుల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష పార్టీ ఓ గూడు అల్లుతోంద‌ని బీజేపీ ఆరోపించింది. ఖుర్షీద్‌పై ఢిల్లీ పోలీసుల వ‌ద్ద ఓ లాయ‌ర్ ఎఫ్ఐఆర్ రిజిస్ట‌ర్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేర‌కు హిందుత్వ‌పై దాడులు జ‌రుగుతున్న‌ట్లు బీజేపీ ఆరోపించింది. ఖుర్షీద్‌ను కాంగ్ర‌స్ పార్టీ నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు.

కాగా,  పాకిస్తాన్ మిలిటరీ అకాడమీకి వెళ్లి ఇండియా గురించి తప్పుడుగా వ్యాఖ్యానించిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి ఆర్ కె సింగ్ ప్రశ్నించారు. అంతే కాకుండా సల్మాన్ ఖుర్షీద్ వికలాంగుల నిధుల్ని దుర్వినియోగం చేసిన వ్యక్తని ఆరోపణలు గుప్పించారు. ఇంత జరుగుతున్న కాంగ్రెస్ ఏమీ చేయడం లేదని, స్పందించడం లేదని, అలా ఎందుకు జరుగుతోందని  ఆర్‌.కే.సింగ్ ప్రశ్నించారు.