ఆరోగ్య నమూనాను విడుదల చేసిన లోక్‌సత్తా

అందరికీ నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించేలా ఫౌండేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎఫ్‌డీఆర్‌), లోక్‌సత్తా సంయుక్తంగా రూపొందించిన ‘టువర్డ్స్‌ వయబుల్‌ యూనివర్సల్‌ హెల్త్‌కేర్‌’ ఆరోగ్య నమూనాను లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ విడుదల చేశారు. ఈ నమూనా ప్రకారం, అన్ని రకాల ఔట్‌ పేషెంట్‌ సేవలకూ ప్రజలు తమకు నచ్చిన డాక్టర్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, వైద్య సేవల మధ్య పోటీతో ఫ్యామిలీ ఫిజీషియన్‌ నేతృత్వంలో ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ. ఇది పైస్థాయి ఆస్పత్రి సేవలకు అనుసంధానమై ఉంటుంది. ఆస్పత్రి చికిత్స అవసరమనుకుంటే ఫ్యామిలీ ఫిజీషియనే సిఫార్సు చేస్తారు. ప్రభుత్వం నిధుల్ని సమకూరుస్తుంది.

ద్వితీయ, తృతీయ స్థాయి చికిత్సల ఆస్పత్రులు ఇన్‌పేషెంట్‌ సేవలకు మాత్రమే పరిమితం. అయితే అత్యవసరాలు మినహాయించి అన్ని కేసుల్లో కింద స్థాయి వైద్యుని నుండి సిఫార్సు (రెఫరల్‌) తప్పనిసరి. 

ఆయుష్మాన్‌ భారత్‌ నుండి తృతీయ స్థాయి వైద్య సేవలను మినహాయించి, ఆ పథకాలు అన్ని ద్వితీయ స్థాయి చికిత్సలకూ అందరు పౌరులకూ వర్తించేలా వాటి పరిధిని విస్తరించటం. తృతీయ స్థాయిలో నాణ్యమైన, ఖర్చుకు తగ్గ ఫలితాలనిచ్చే వైద్య సేవలందించేలా దేశంలోని జిల్లా, ప్రభుత్వ బోధనాస్పత్రులను అభివృద్ధి చేయటం. అదనపు వనరుల్ని సమకూర్చటం. 

ఈ నమూనాను అమల్లోకి తేవటానికయ్యే ఖర్చులో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరిస్తున్నా, ప్రైవేట్‌ రంగానికి కూడా కీలక పాత్ర ఉంటుంది. ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యాలు, ఆర్థిక వనరుల సేకరణకు వినూత్న పద్ధతులతో ఈ నమూనా రూపొందింది. దేశవ్యాప్తంగా ఈ నమూనా అమలుకు అదనం గా అయ్యే వ్యయం ఏడాదికి సుమారు రూ. 85 వేల కోట్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో అదనపు వ్యయం వరుసగా సుమారు రూ.1,900 కోట్లు, రూ. 2,600 కోట్లు ఉంటుంది. 

ఈ సంస్కరణల అమలు ఆవశ్యకతను తెలియచెప్పి ఒప్పించే క్రమంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్, ఆర్థిక సలహా మండలి, పార్లమెంటు సభ్యులు, మీడియా, ఈ రంగంలో పనిచేస్తున్న ఇతర అనేక సంస్థలు, వ్యక్తులు ఇలా సంబంధితుందరికీ ఎఫ్‌డీఆర్‌ వివరాలను అందించింది.

ఆరోగ్య రంగం రాష్ట్రాల జాబితాలోని అంశం కాబట్టి, అంతిమంగా సంస్కరణలు రాష్ట్రాల నుండి ప్రారంభం కావాలి. కాబట్టి ఎఫ్‌డీఆర్‌ ఈ నమూనాను దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్య మంత్రులు, ఇతర సంబంధిత ఉన్నతాధికారులకు పంపింది. ఈ సంస్కరణలను అమలు చేసేలా ప్రభుత్వాలను ఒప్పించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషాతో మొదలు పెట్టి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులని వ్యక్తిగతంగా కూడా కలవాలని లోక్‌సత్తా, ఎఫ్‌డీఆర్‌ భావిస్తోంది.