రైతుల పైనే హమాలీల ఖర్చుల భారం 

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూచి లోడ్ చేసే హమాలీల ఖర్చుల భారాన్ని రైతులపైనే వేసి, తిరిగి చెల్లించకుండా కేసీఆర్  సర్కారు దోపిడీ చేస్తోందని బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో వడ్లను తూకం వేసి లోడ్ చేసే హమాలీలకు రైతుల నుంచి చార్జీలను ఇప్పిస్తూ… ఆ డబ్బులను రైతులకు తిరిగి చెల్లించడంలో మాత్రం సీఎం కేసీఆర్  ముందడుగు వేయడం లేదని ఆమె తెలిపారు. 

ముందుగా రైతులు చెల్లిస్తే, ఆ మొత్తాన్ని రైతుల అకౌంట్లలో తిరిగి వేస్తామని చెప్పిన రాష్ట్ర సర్కార్ 2017 నుంచి ఇప్పటి వరకు పైసా చెల్లించకుండా రైతులను నిండా ముంచిందని ఆమె ధ్వజమెత్తారు. గడిచిన నాలుగేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా వడ్లు అమ్మిన రైతులకు సర్కారు ఏకంగా రూ.500 కోట్లకు పైగా బకాయి పడినట్లు అధికారులు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధమవుతోందని ఆమె తెలిపారు. 

ప్రతి సంవత్సరం వ్యయప్రయాసలకోర్చి, రైతులే రవాణా ఖర్చులు భరించి కొనుగోలు సెంటర్లకు వడ్లు తెస్తుండగా, తూకం వేసి, లోడింగ్ చేసే హమాలీలకు క్వింటాల్‌కు రూ.20 చొప్పున చెల్లించాల్సిన మొత్తంలో రూ. 5 కేంద్రం తన వాటాగా ఇస్తుంటే,మిగిలిన రూ.15ను సివిల్ సప్లయ్స్ శాఖ ద్వారా చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అలా ఇవ్వకుండా దోబూచులాడుతోందని విజయశాంతి విమర్శించారు. 

ఇక సర్కారు నుంచి హమాలీ చార్జీలు రాక పోవడంతో సెంటర్లలోని నిర్వాహకులు మొదట మీరు డబ్బులు ఇవ్వండి… ప్రభుత్వం రిలీజ్ చేశాక ఆ మొత్తాన్ని మీ అకౌంట్లలో తిరిగి జమ చేస్తామని రైతుల నుంచి నయానో, భయానో హమాలీ చార్జీలను వసూలు చేస్తున్న అధికారులు తిరిగి ఇప్పించడంపై దృష్టి పెట్టకుండా జాప్యం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 

కాగా… హమాలీలు గతంలో క్వింటాలుకు రూ.25 వరకు వసూలు చేయగా, ప్రస్తుతం రూ 30, రూ.35 దాకా వసూలు చేస్తున్నారని విజయశాంతి చెప్పారు. ఇక ఈ వానాకాలంలో  హమాలీల కొరత ఉన్నచోట్ల రూ.50 వరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నదాని ఆమె చెప్పారు. వడ్లపై రాజకీయాలు చేస్తూ రైతులను అయోమయంలోకి పడేయడం రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అని విజయశాంతి దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ స్పందించి పాత బకాయిలను ఇప్పించడంతో పాటు కొత్త హమాలీ చార్జీలను సర్కారే నేరుగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.