ట్విట్టర్ లో ప్రభావిత వ్యక్తుల్లో మోదీ, సచిన్ 

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌లు ఈ ఏడాది ట్విటర్‌లో అత్యంత ప్రభావవంతమైన 50 మంది వ్యక్తుల్లో నిలిచినట్లు బ్రాండ్‌వాచ్ నిర్వహించిన వార్షిక పరిశోధనలో తేలింది. 

అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో స్థానంలో,భారత మాజీ కెప్టెన్ సచిన్ 35వ స్థానంలో నిలిచారు. మోదీ, సచిన్‌లు అమెరికన్ నటులు డ్వేన్ జాన్సన్, లియోనార్డో డి కాప్రియో, యునైటెడ్ స్టేట్స్ మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా వంటి వారి కంటే అగ్రస్థానంలో ఉన్నారు.

ఈ జాబితాలో అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ నంబర్ 1 స్థానంలో నిలిచారు. రెండుసార్లు ప్రధాని పదవిని అధిష్ఠించిన నరేంద్రమోదీ ట్విటర్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో రెండోస్థానంలో నిలవడం విశేషం. స్వదేశంలో 70 శాతం మంది మద్దతుతో అత్యంత ఎక్కువగా ప్రజాకర్షణ గల దేశాధినేతలతో మొదటివారుగా వచ్చిన మోదీకి ట్విట్టర్ లో 72.5 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్న నేతలలో ప్రధాని ముందున్నారు.

సచిన్ టెండూల్కర్ కు దశాబ్దానికి పైగా యునిసెఫ్ తో అనుబంధం ఉంది. ఆయనకు ట్విట్టర్ లో 36.2 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. క్రికెటర్ గా మరెవ్వరు అధిగమించలేని పలు రికార్డులు సంపాదించిన సచిన్,  క్రికెట్ పోటీల నుండి రిటైర్ అయిన తర్వాత పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

2013లో దక్షిణాసియా అంబాసిడర్ గా నియమితులయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య, క్రీడల కార్యక్రమాలకు టెండూల్కర్ మద్దతు ఇచ్చారు.బ్రాండ్‌వాచ్ తమ బ్రాండ్‌ల ఆన్‌లైన్ ఉనికిని విశ్లేషించడానికి కంపెనీలకు సమాచారం అందించడానికి సోషల్ మీడియా డేటాను ఉపయోగిస్తుంది.