పాక్‌కు చైనా భారీ అత్యాధునిక యుద్ద నౌక

పాకిస్థాన్‌కు భారీ, అత్యంత ఆధునిక యుద్ధ నౌకను చైనా అందజేసింది. చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనిని డిజైన్ చేసి, నిర్మించింది. దీనిని షాంఘైలో జరిగిన జల ప్రవేశ కార్యక్రమంలో పాకిస్థాన్ నేవీకి అప్పగించినట్లు ఈ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఇంత అత్యాధునిక యుద్ధ నౌకను విదేశాలకు అందజేయడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. అరేబియా, హిందూ మహా సముద్రాల్లో పాక్ నేవీ బలం పెరగాలని చైనా కోరుకుంటున్న సంగతి తెలిసిందే. టైప్ 054ఏ/పీ రకానికి చెందిన ఈ యుద్ద నౌకకు పీఎన్ఎస్ టుఘ్రిల్ అని పేరు పెట్టినట్లు గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
చైనాకు పాకిస్థాన్ రాయబారి మొయిన్ ఉల్ హక్ మాట్లాడుతూ, హిందూ మహా సముద్రంలో బలాల సమతుల్యతకు పీఎన్ఎస్ టుఘ్రిల్ దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రత విషయంలో టుఘ్రిల్ క్లాస్ యుద్ధ నౌకలు పాకిస్థాన్ నావికా దళ సామర్థ్యాన్ని పెంచుతాయని చెప్పారు.
హిందూ మహా సముద్రంలో ఎదురయ్యే సవాళ్ళు, సముద్ర రక్షణ, శాంతి, సుస్థిరతలను  కాపాడటానికి ఉపయోగపడుతుందని చెప్పారు. పాకిస్థాన్ నావికా దళం విడుదల చేసిన ప్రకటనలో, ఇటువంటి యుద్ధ నౌకలు నాలుగింటిని పాకిస్థాన్ కోసం చైనా తయారు చేస్తున్నట్లు తెలిపింది.
వీటిలో మొదటిది ఇప్పుడు పాకిస్థాన్ నావికా దళానికి అందినట్లు తెలిపింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగనతలానికి, సముద్రంలోపలి జలాల్లో దాడులు చేసే సత్తా దీనికి ఉందని పేర్కొంది. దీనికి విస్తృత  నిఘా సామర్థ్యం ఉందని వివరించింది.