ఇటలీ రక్షణ సంస్థపై నిషేధం ఎత్తివేత!

రూ.3,600 కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ కుంభకోణానికి సంబంధించి.. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌లో భాగమైన ఇటలీ రక్షణ రంగ దిగ్గజం లియోనార్డోపై నిషేధాన్ని ఎత్తివేయాలని భారత్ నిర్ణయించింది. పలు షరతులతో ఈ నిర్ణయం తీసుకున్నది. 

ఇటలీ సంస్థపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు కొనసాగనున్నది. భారత్‌లో ఆర్థిక సమస్యల విషయానికి వస్తే  లియోనార్డో మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని, అంటే లియోనార్డో ఇంతకు ముందు చేసుకున్న ఒప్పందం ఆధారంగా భారత్‌పై ఎలాంటి వాణిజ్య దావా వేయలేరని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఈ నిషేధం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు సంబంధించింది కాగా, కేసులో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చాక ఇటాలియన్‌ సంస్థతో ఒప్పందాన్ని నిలిపివేశారు. ఇందులో బ్లాక్‌ టార్పెడో డీల్‌ సైతం ఉండగా,  నావికాదళం కొనుగోలు కోసం ఆమోదించారు. 

ఇటలీ సంస్థ అభ్యర్థన మేరకు న్యాయమంత్రిత్వ శాఖ, దర్యాప్తు సంస్థలను సంప్రదించిన అనంతరం రక్షణ మంత్రిత్వ శాఖ నిషేధం ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.  రూ.3600కోట్ల వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో రాజీవ్‌ సక్సేనా అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్ సక్సేనా దుబాయిలో నివాసం ఉండగా, అతన్ని 2019లో భారత్‌కు తీసుకువచ్చి అరెస్టు చేశారు. 2010లో రూ.3,600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్‌లను కొనుగోలు చేసిన విషయం మూడేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది.  

ఈ సందర్భంగా భారత వైమానిక దళం, భారత ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నేతల ప్రమేయంపై ఆరోపణల నేపథ్యంలో 2013-14లో యూపీఏ ప్రభుత్వం ఇటాలియన్‌ సంస్థతో ఒప్పందాలపై నిషేధం విధించింది. హెలికాప్టర్ల కొనుగోళ్ల డీల్‌లో యూరోపియన్‌ ఏజెన్సీలు అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ అధికారులను అరెస్టు చేయడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది.