* 121వ జయంతి నివాళి
ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కేరళలో 1957లో ఇఎంఎస్ నంబూద్రిపాద్ ఏర్పాటు చేయడానికి ముందే ఆంధ్రాలో ఏర్పాటు చేయడంకోసం కమ్యూనిస్టులు విఫల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలను అడ్డుకొన్న యోధుడు రైతు నేత ఆచార్య ఎన్జీ రంగ అని చెప్పవచ్చు. ఒక్కసారి కాదు, వరుసగా రెండు సార్లు కేవలం ఆయన కారణంగా కమ్యూనిస్టులు ఆంధ్రాలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయారు.
మొదటగా, 1952లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో స్వతంత్ర భారత దేశంలో జరిగిన తొలి సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ కు మెజారిటీ రాలేదు. దానితో సుమారు 60 మంది సభ్యులు గల కమ్యూనిస్ట్ పార్టీ మరికొంతమంది మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా 20 మంది సభ్యులున్న కృషికార్ లోక్ పార్టీ అధినేత ఆచార్య ఎన్జీ రంగా మద్దతు కీలకమైనది.
అయితే కమ్యూనిస్ట్ లు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయన సుతారం ఇష్టపడలేదు. అందుకనే, మొదటి గవర్నర్ జనరల్ గా పనిచేసి, దాదాపు రాజకీయాల నుండి నిష్క్రమించిన రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిగా చేస్తే మద్దతు ఇస్తానని కాంగ్రెస్ కు ప్రతిపాదించి, ఆయన రెండుసారి ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేశారు.
ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో 1955లో జరిగిన తొలి ఎన్నికలలో తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు కమ్యూనిస్టులు కలలు కన్నారు. ముందుగానే సుందరయ్య ముఖ్యమంత్రి, బసవపున్నయ్య హోమ్ మంత్రి అంటూ మొత్తం మంత్రివర్గాన్ని ప్రకటించారు.
ఈ సారి కూడా కాంగ్రెస్ బయట ఉన్న ఆచార్య రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి, ఎన్నికలలో ఉమ్మడిగా పోటీచేసి, కమ్యూనిస్టులను ఓడించారు. అప్పటి దెబ్బకు ఆ తర్వాత వారు కోలుకోలేదు. నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభలలో కనీసం ప్రాతినిధ్యం లేకుండా కమ్యూనిస్ట్ పార్టీలు ఉనికి కోల్పోయే పరిస్థితులలో ఉన్నాయి.
రాజకీయంగా అధికారమలోకి రాకుండా అడ్డుకోవడమే కాకుండా, సైద్ధాంతికంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు రంగా అని చెప్పవచ్చు. ఆంధ్రాలో ప్రతి గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఉండేవారు. రష్యా విప్లవం స్పూర్తితో అనేకమంది యువత వారిని అనుసరించేవారు.
అందుకు విరుగుడుగా రాజకీయ పాఠశాలలు నెల రోజుల చొప్పున జరిపేవారు. మొదటి పాఠశాల 1934లో తన స్వగ్రామం నిడుబ్రోలులోనే జరిపారు. ఆ తర్వాత ఆంధ్ర రాజకీయాలలో రాటుతేలిన అనేకమంది నాయకులు ఈ పాఠశాలలో శిక్షణ పొందినవారే.
రైతాంగ సమస్యలపై ఒకవైపు రాజీలేని పోరాటాలు జరుపుతూ, మరోవంక కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతూ రావడంతో, ఆయన జీవించి ఉన్నంత వరకు కమ్యూనిస్టులు ఆయనను క్షమించలేక పోయారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం రైతు కులాలకోసమే పనిచేస్తూ వస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు భారత్ లో మాత్రం వ్యవసాయ సంఘాలు ఏర్పాటు చేసుకొని, రైతు సమస్యలపై కూడా పోరాటాలు చేయడం రంగా ప్రభావంతోనే అని గమనించాలి.
గుంటూరు జిల్లా నిడుబ్రోలు గ్రామంలో 1900 నవంబర్ 7న ఒక సాధారణ రైతు కుటుంభంలో జన్మించిన ఆయన ఐసిఎస్ పరీక్షలకు చదవడం కోసం బంధువులు, మిత్రుల సహకారంతో లండన్ వెళ్లారు. కానీ అక్కడకు చేరుకోగానే మహాత్మా గాంధీని బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసారని తెలుసుకొని ఆగ్రహం చెందారు.
ఐసిఎస్ అధికారిగా అటువంటి ప్రభుత్వంలో తాను పనిచేయాలా అంటూ ఇంటికి వెళ్ళిపోతానన్నారు. అయితే మిత్రుల ప్రోత్సాహంతో అక్కడనే ఉండి అర్ధశాస్త్రంలో ఆక్సఫోర్ట్ యూనివర్సిటీ నుండి బి.లిట్ డిగ్రీ పొంది, తిరిగి వచ్చి మద్రాస్ లోని పచ్చపాస్ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. కానీ గాంధీజీ పిలుపందుకొని ఉద్యోగం వదిలి, స్వతంత్ర సంగ్రామంలో చేరారు.
More Stories
ఇడ్లీకి ఒక రోజు….. నేడే ఇడ్లి దినోత్సవం
సత్యేందర్ జైన్పై సీబీఐ విచారణ
ప్రధాని మోదీపై రేవంత్ అనుచిత వాఖ్యలు … ఈటెల ఆగ్రహం