కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు  

హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు కుటుంబపాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని  కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. అహంకారానికి, అధర్మానికి ప్రజలు చరమగీతం పాడారని ఆయన చెప్పారు. హుజూరాబాద్ విజయం ప్రజల విజయం అని పేర్కొంటూ టీఆర్ఎస్ చాలా రకాలుగా మభ్యపెట్టినా ప్రజలు మరో చరిత్ర లిఖించారని ఆయన కొనియాడారు.

అక్కడి ప్రజలు  నైతిక విలువలకు, నీతికి, నిజాయితీకి మద్దతుగా ప్రజలు నిలబడ్డారని సంతోషం వ్యక్తం చేశారు. తన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.

‘‘ప్రజలను అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా 60 శాతం మహిళలు బీజేపీకి అండగా నిలబడ్డారు. ఐదు నెలల్లో హుజూరాబాద్‌లో సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు, పెండింగ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వేలాది కోట్లతో కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టినా అధికార టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు” అని పేర్కొన్నారు. 

అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు లొంగలేదని చెబుతూ  తెలంగాణలో ధన రాజకీయాలకు హుజూరాబాద్ ప్రజలు చరమగీతం పాడారని స్పష్టం చేశారు. డబ్బుకంటే మంచిపాలన ముఖ్యమని ప్రజలు నిరూపించారని అభినందనలు తెలిపారు.

‘‘కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు గమనించారు . ప్రజల విశ్వాసం ముందు ధనం వృధా అని హుజూరాబాద్ ఎన్నికలు నిరూపించాయి. అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలను ముందు నుండి అప్రమత్తం చేసాం. నోట్ల కట్టల కంటే నైతిక విలువలు ముఖ్యమని ప్రజలు నిరూపించారు” అని కిషన్ రెడ్డి వివరించారు. 

అబద్ధాల, సమాధుల పాలన చేస్తూ టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ప్రజలకు బీజేపీ రుణపడి ఉంటుందని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నిక విజయావకాశాలపై ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో ఉండి ఆరా తీశారని ఆయన పేర్కొన్నారు. 

హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడానికి టీఆర్ఎస్ చేయని ప్రయత్నం, చెప్పని అబద్ధం లేదని అంటూ అలాంటిది బీజేపీ, కాంగ్రెస్ కలసి పని చేశాయని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యనించడం హాస్యాస్పదం అని మండిపడ్డారు. ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ నాయకులను తన పార్టీలో చేర్చుకుందని ఆయన గుర్తు చేశారు. ఈటల పట్ల టీఆర్ఎస్ చాలా అవమానకరంగా ప్రవర్తించిందని, ఆయనపై కేసులు పెట్టి చాలా ఇబ్బందులకు గురిచేసిందని కేంద్ర మంత్రి మండిపడ్డారు.