సెమీకండక్టర్లలో చైనాను దెబ్బ చేయనున్న భారత్ 

ఇప్పటికే `చైనాలో తయారీ’ అయిన వినియోగ వస్తువులను బహిష్కరించాలని డిమాండ్లు దేశ వ్యాప్తంగా పెరుగుతూ ఉండడంతో ప్రస్తుత పండుగ సీజన్లో లో చైనా నుండి దిగుమతులు భారీగా తగ్గిపోయి, ఆ దేశానికి పెద్ద ఎత్తున నష్టం కలిగించిన, భారత్ ఇప్పుడు సెమీకండక్టర్లలో కూడా దెబ్బకొట్టడానికి సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. 

ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ల ఎగుమతి దేశంగా చైనా ఉంది. ఇప్పుడు ఈ రంగంలో భారీగా పెట్టుబడులను ఆకట్టుకొనే విధంగా భారత ప్రభుత్వం విధానపరమైన కృషి చేస్తున్న దృష్ట్యా, రాబోయే రోజులలో ఈ రంగంలో చైనాకు భారీ నష్టం కలిగించే అవకాశాలున్నట్లు పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. 

ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా ఏర్పడిన సెమీకండక్టర్‌ చిప్‌ల కొరతను అధిగమించడానికి భారత్ ప్రయత్నిస్తుంది. దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించడానికి భారతదేశం మెగా మల్టీ-బిలియన్-డాలర్ క్యాపిటల్ సపోర్ట్, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ ప్లాన్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా చిప్ కొరత కారణంగా అన్నీ రంగాలలోని పరిశ్రమలు భారీ ఉత్పత్తి కోతలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్లాన్‌ రూపొందిస్తున్నట్లు ఉన్నత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు దేశంలో సెమీకండక్టర్ల పరిశ్రమలను ఏర్పాటు చేయాలని తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ), ఇంటెల్, ఎఎమ్‌డీ, యునైటెడ్ మైక్రోఎలక్ట్రానిక్స్ కార్ప్, ఫుజిట్సు వంటి కొన్ని అగ్ర సెమీకండక్టర్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారు.

సెమీకండక్టర్ తయారీదారులను వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలనే ప్రధానమంత్రి కార్యాలయం ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కంపెనీలను దేశంలోకి తీసుకురావడానికి ఆకర్షణీయమైన విధానంతో ముందుకు రావాలని బహుళ మంత్రిత్వ శాఖలు ఆదేశించింది.

సెమీకండక్టర్ తయారీదారులకు దిగుమతి వస్తువులపై సుంకం రాయితీ ఇవ్వాలని భావిస్తున్నారు. అలాగే, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ & సెమీకండక్టర్(ఎస్ఎసీఎస్), తయారీని ప్రోత్సహించే పిఎల్ఐ స్కీం వంటి పథకాల నుంచి కూడా ప్రభుత్వం అదనపు ప్రయోజనాలను అందించాలని చూస్తుంది. 

దేశంలో సెమీకండక్టర్లను తయారు చేయకపోవడంతో దేశంలోని డిమాండ్ తీర్చడం కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. భారతదేశంలో సెమీకండక్టర్ల డిమాండ్ 2025 నాటికి ప్రస్తుతం ఉన్న 24 బిలియన్ డాలర్ల నుంచి సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరుకొనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

సెమీకండక్టర్ తయారీదారులను దేశానికి ఆకర్షించడానికి ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, రక్షణ, ఆటో వంటి ఇతర రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అవసరాలు ఈ కంపెనీలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.