అజిత్ ప‌వార్‌కు చెందిన రూ 1000 కోట్ల ఆస్తులు సీజ్

మ‌హారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత  శరద్ పవర్ మేనల్లుడు అజిత్ ప‌వార్‌కు చెందిన సుమారు రూ 1000 కోట్లకు పైగా విలువైన  ఆస్తుల‌ను ఆదాయ‌ప‌న్ను శాఖ సీజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ముంబైలోని నారీమ‌న్ పాయింట్ వ‌ద్ద ఉన్న నిర్మ‌ల్ ట‌వ‌ర్‌తో పాటు అయిదు ఆస్తులను ఐటీ శాఖ‌కు అటాచ్ చేసిన‌ట్లు ఈడీ వ‌ర్గాలు తెలిపాయి.

మ‌హారాష్ట్ర‌లోని స‌తారాలో జ‌రందేశ్వ‌ర్ చ‌క్కెర ఫ్యాక్ట‌రీ, ముంబైలోని ప‌లు కార్యాల‌యాలు, ఢిల్లీలో ఓ ఫ్లాట్‌, గోవాలో ఓ రిసార్ట్ స‌హా మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో ఉన్న 27 భూములు స‌హా ప‌లు ఆస్తుల‌ను ఐటీ అధికారులు అటాచ్ చేశారు. ఈ ఆస్తులు ఏవీ అజిత్ ప‌వార్ పేరుతో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక గ‌త వారం అజిత్ ప‌వార్ బంధువుల‌కు చెందిన‌విగా భావిస్తున్న రెండు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార సంస్ధ‌ల‌పై ఐటీ అధికారులు చేప‌ట్టిన దాడుల్లో రూ 184 కోట్ల లెక్క‌తేల‌ని ఆదాయాన్ని గుర్తించారు.

గ‌త నెల‌లో ఐటీశాఖ ప‌వార్ బంధువుల ఇండ్ల‌ల్లో దాడులు చేసింది.  ప‌వార్ సోదరీమణుల ఇండ్ల‌ల్లోనూ దాడులు జ‌రిగాయి. ముంబైతో పాటు పుణె న‌గ‌రాల్లో ఈ సోదాలు జ‌రిగాయి. అజిత్ ప‌వార్ బంధువు జ‌గ‌దీశ్ ఇంట్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. బినామీ ఆస్తుల ల‌బ్ధిదారుల్లో అజిత్ ప‌వార్‌, ఆయ‌న కుటుంబం ఉన్న‌ట్లు ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

అజిత్ కుటుంభంపై యాంటీ బినామీ చ‌ట్టం కింద కేసు నమోదు చేశారు. అజిత్ త‌న ఆస్తుల‌ను న్యాయ‌మైన ప‌ద్ధ‌తిలో ఆర్జించ‌లేద‌ని ఐటీశాఖ చెప్పింది. అయితే త‌న‌కు లింకు ఉన్న అన్ని సంస్థ‌లు క్ర‌మ ప‌ద్ధ‌తిలో ప‌న్నులు చెల్లించిన‌ట్లు అజిత్ ప‌వార్ చెప్పారు.  ప్ర‌తి ఏడాది ప‌న్నులు చెల్లిస్తామ‌ని, ఆర్థిక మంత్రి అయిన‌ప్ప‌టి నుంచి ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తున్నాని, త‌న‌తో లింకున్న అన్ని కంపెనీలు ప‌న్నులు చెల్లించిన‌ట్లు ఎన్సీపీ నేత అజిత్ గ‌త నెల‌లో వెల్ల‌డించారు.