అయోధ్య కోసం కాబుల్ నది నీరు పంపిన ఆఫ్ఘన్ బాలిక 

అఫ్ఘానిస్థాన్‌లోని ఓ అమ్మాయి పంపిన కాబుల్ నది నీరును గంగాజలంతో కలిపి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం అయోధ్యలోని రామజన్మభూమిలో ‘జలాభిషేకం ’ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకే ఆదిత్యనాథ్ ఇలా చేశారని తెలుస్తున్నది. 

అంతకు ముందు ఆదిత్యనాథ్ తన అధికారిక నివాస గృహం వద్ద తాను దీపోత్సవం 2021 వేడుకల ఏర్పాట్లను సమీక్షించబోతున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఆయన ‘గౌరవనీయ ప్రధాన మంత్రికి అఫ్ఘానిస్థాన్ నుంచి ఓ అమ్మాయి కాబుల్ నది నీరు పంపి, దానిని అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో అర్పించాల్సిందిగా కోరింది’ అని  వెల్లడించారు. ఆ దృష్ట్యా  తాను ఈ దీపోత్సవంకు ప్రత్యేకించి ఆ సెంటిమెంట్‌ను జోడించడానికే వచ్చానని తెలిపారు. 

ఈ సందర్భంలో జరిగిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఒక చిన్న బాటిల్‌ను చూపిస్తూ, “ఇది కాబూల్‌లోని నది నుండి అయోధ్యలోని శ్రీరామ జన్మభూమికి సమర్పించడానికి ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఒక అమ్మాయి ప్రధాని మోదీకి పంపిన నీరు. ఈ రోజు నేను ఆ అమ్మాయి, ఆమె కుటుంబం, అక్కడ ఉన్న మహిళలందరి భావోద్వేగాలతో పాటు ఈ నీటిని శ్రీరాముడికి సమర్పించడానికి చొరవ తీసుకుంటున్నాను” అని తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలన ఉన్నప్పటికీ, భారతదేశం, భారతీయత, భారత నేల పట్ల ఆ అమ్మాయికి ఉన్న గౌరవం ఆమెలో చెక్కుచెదరకుండా ఉందని ఆదిత్యనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘గతంలో ఉన్న అడ్డంకులు, పోరాటాలను తొలగించి శ్రీరామ జన్మభూమి పనులు శరవేగంగా జరగడం మనందరికీ గర్వకారణం. గంగా జలంతో పాటు ఈ నీటిని కూడా అక్కడ అందించనున్నాను. ఇది దేశం,   ప్రపంచంలో నెలకొన్న భావోద్వేగాలకు సంబంధించినది” అని తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా, తన గురించి చింతించకుండా, కాబూల్‌కు చెందిన ఒక అమ్మాయి అక్కడ ఉన్న నది నుండి నీటిని రామజన్మభూమికి సమర్పించడానికి పంపిన భావోద్వేగాలను తాను  గౌరవిస్తానని చెప్పారు. వారికి సంతోషకరమైన జీవితం ప్రసాదింపమని తాను  రాముడిని ప్రార్థిస్తానని ఆదిత్యనాథ్ తెలిపారు.

తాలిబన్లు భారత్‌ వైపు వస్తే వైమానిక దాడే!

తాలిబన్లు భారత్ వైపు వచ్చేందుకు సాహసిస్తే వైమానిక దాడికి తాము సిద్ధమని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హెచ్చరించారు.లక్నో నగరంలో జరిగిన సామాజిక ప్రతినిధుల సమ్మేళనంలో రాష్ట్రంలోని తన రాజకీయ ప్రత్యర్థులపై కూడా దాడికి దిగారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేడు దేశం శక్తివంతంగా ఉంది, ఏ దేశమూ భారత్‌ వైపు దృష్టి సారించే సాహసం చేయలేకపోతోంది. నేడు పాకిస్థాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌లు తాలిబాన్ల వల్ల కలవరపడుతున్నాయి. కానీ, తాలిబన్లు భారత్ వైపు వస్తే తాము వైమానిక దాడికి సిద్ధంగా ఉన్నాం’’ అని సీఎం యోగి హెచ్చరించారు.

త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం యోగి విపక్షాలపై విమర్శల దాడి పెంచారు. యూపీ అభివృద్ధితో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు సంబంధం లేదని సీఎం స్పష్టం చేశారు. రామభక్తులను హత్య చేసిన వారికి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పే ధైర్యం ఉందా అని ఎస్పీ పేరు చెప్పకుండా ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.