వ్యవసాయ కమిషనరేట్‌ను ముట్టడించిన బిజెపి

వరి సాగు చేయవద్దన్న కేసీఆర్‌ ప్రభుత్వ ఆంక్షలను నిరసిస్తూ బీజేపీ శుక్రవారం అనూహ్యంగా వ్యవసాయ కమిషనరేట్‌ను ముట్టడించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉదయం ఆరు గంటల సమయంలో కొంతమంది ముఖ్య నేతలతో పాటు కిసాన్‌ మోర్చా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
 
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పాటు వరి సాగు చేయవద్దన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించిన పార్టీ నేతలు, అప్పటికప్పుడు రైతులతో కలిసి వ్యవసాయ కమిషనరేట్‌ వద్దకు వెళ్లి నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు బీజేపీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. 
 
కాగా, పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బండి సంజయ్‌ తెలిపారు. రైతులకు అండగా పోరాడితే లాఠీచార్జ్‌ చేస్తారా? అని మండిపడ్డారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వీరిని సంజయ్‌ పరామర్శించారు. లాఠీచార్జ్‌లో హైదరాబాద్‌ కేంద్ర జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి కాలు విరిగిందని, రంగారెడ్డి అర్బన్‌ జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు మహేశ్‌ యాదవ్‌, కామారెడ్డి జిల్లాకు చెందిన పాటిమీది గంగారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు.

ఇలా ఉండగా, సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రులంతా గొర్రెలని, ధాన్యం కొనుగోలుపై తలోమాట మాట్లాడుతున్నాయని బిజెపి ఎంపీ డి అరవింద్ విమర్శించారు. బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని మాత్రమే కేంద్రం చెప్పగా, గులాబీ గొర్రెలు తలోరకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.