టీవీ ఛానల్స్ ప్రసార ఛార్జ్ లపై ట్రాయ్ హెచ్చరిక 

టీవీ ఛానల్స్ ప్రసారకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ప్రభుత్వ అధీనంలోని ట్రాయ్ హెచ్చరించింది. వినియోగదారుల నుంచి వీరి వసూళ్లపై తగు విధమైన నిఘాపెట్టడం జరుగుతుందని టెలికం వ్యవహారాల నియంత్రణ మండలి అయిన ట్రాయ్ స్పష్టం చేసింది.

వినియోగదారులు ఎంచుకునే టీవీ ఛానల్స్‌కు డిష్ ప్రసారదార్ల అలా కార్టే ప్రైసింగ్ విధానంలో ఉన్న స్వేచ్ఛను దుర్వినియోగపరిస్తే ఊరుకునేది లేదని ట్రాయ్ తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాలు, ఈ రంగం బాగోగులు కీలక అంశాలని ప్రకటనలో తెలిపారు. ఇటీవలి కాలంలో ప్రాచుర్యంలో ఉన్న బ్రాడ్‌కాస్టర్లు వెలువరించిన తాజా టారీఫ్ వివరాలపై ట్రాయ్ స్పందించింది. 

ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్ ఛానల్స్ వంటి ప్రధాన ఛానల్స్‌ను ప్రసారం చేసినట్లు అయితే వేరే రేటు ఉంటుంది. అదే విధంగా ప్రాచుర్యం పొందిన ఛానల్స్ ప్రసారానికి వినియోగదారుల నుంచి వేరే రేటు తీసుకోవడం జరుగుతుందని తెలుపుతూ ఈ టారీఫ్ ప్రకటన వెలువరించారు. దీనిపై ట్రాయ్ స్పందించింది.

ఇప్పటికే బ్రాడ్‌కాస్టర్లు వివిధ ప్రాంతాలలో పలు కీలక ఛానల్స్ ప్రసారాలను అత్యధిక రుసుం చెల్లించే వారికే అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. తమకు ఈ విధంగా ధరలు ఖరారు చేసే అధికారం స్వేచ్ఛ ఉందని తెలియచేసుకుంటున్నారు. సంబంధిత ప్రసారకర్తలు ఎవరు? పేర్లు వంటి అంశాలను ట్రాయ్ నిర్థిష్టంగా తెలియచేయలేదు. 

అయితే ఇటువంటి చర్యలకు పాల్పడే ఏ సంస్థపై అయినా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రసారసంస్థలు ఈ మధ్యకాలంలో వినియోగదారుల నుంచి రేట్లను పెంచడాన్ని ట్రాయ్ ఆదేశాలకు అనుగుణంగానే చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. 

ఇది పూర్తిగా దుష్ప్రచారం అని న్యూ టారీఫ్ ఆర్డర్ అండ్ బ్రాడ్‌కాస్ట్ రెగ్యులేషన్స్ (ఎన్‌టిఒ) 2.0కి అనుగుణంగానే రేట్లు పెంచాల్సి వస్తున్నట్లు పేర్కొంటూ వాస్తవాలను వక్రీకరిస్తున్నారని తెలిసిందని, దీనిని తీవ్రవిషయంగానే పరిగణించడం జరుగుతుందని ట్రాయ్ హెచ్చరించింది.