హిందూ దేవతలపై విద్వేష ప్రతిజ్ఞ.. ప్రవీణ్ కుమార్ పై కేసు 

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల మాజీ కార్యదర్శి, స్వేరోస్ అధినేత, మాజీ ఐపిఎస్ అధికారి డా ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని కరీంనగర్‌ మున్సిఫ్‌ న్యాయమూర్తి సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఐపీఎస్ కు రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
మెజారిటీ ప్రజలు ఆరాధ్యదైవంగా పూజించే హిందు దేవతలను ఆవమానించే రీతిలో విద్వేషపూరితంగా ప్రతిజ్ఞ చేసిన సంఘటనలో కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా కరీంనగర్ మూడవ పట్టణ పోలీసు స్టేషన్ ఎస్.హెచ్.ఓకు  ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు.
కేసు వివరాల్లోకి వెళ్లితే.. ఈ ఏడాది  మార్చిలో పెద్దపల్లి జిల్లా జులపెల్లి మండలం వడుకపూర్ (ధూళికట్ట) గ్రామంలో స్వేరోస్ భీమ్ దీక్ష కార్యక్రమంలో ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంలో స్వేరో సభ్యులతో కలిసి స్వేరోస్ సభ్యుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు న్యాతరి శంకర్ బాబు చేయించిన ప్రతిజ్ఞ వివాదాస్పదం అయింది.
హిందూ దేవుళ్లు అయిన రాముడు, కృష్ణుడుతోపాటు ఇతర హిందు దేవతల ఎవరి మీద నమ్మకం లేదని, వాళ్ళను పూజించనని, అలాగే శ్రాద్ధా కర్మలు పాటించనని, పిండదానాలు చేయబోమని, హిందు విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. స్వేరోస్ సభ్యులందరూ ఎడమ చేతిని చాచి ప్రతిజ్ఞ చేస్తుంటే వారితో పాటు ప్రవీణ్ కుమార్ కూడా అదే తరహలో ప్రతిజ్ఞ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్  అయ్యాయి.
 
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిని చూసిన న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి తన మత విశ్వాసాలను దెబ్బతీసినారని, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి హిందు దేవుళ్లను ఆవమానించి, కించపరిచే విధంగా వ్యవహరించినారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 
 
ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కుమార్ ప్రతిజ్ఞ చేసిన వీడియోను, పలు పత్రికలో వచ్చిన వార్తలను సేకరించి, ఆధారాలతో సహా కరీంనగర్ మూడవ పట్టణ పోలీసు స్టేషన్ లో తేదీ 16 మార్చ్ 2021 రోజున ఫిర్యాదు చేశాడు. కాగా పోలీసులు ప్రవీణ్‌కుమార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పై అధికారైన పోలీసు కమీషనర్ కు తేదీ 18 మార్చ్ 2021 రోజున మరోసారి ఫిర్యాదు చేశాడు. 
 
సదరు పోలీసు ఉన్నతాధికారులు సైతం ప్రవీణ్‌కుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో చివరికి తేదీ 22 మార్చ్ 2021 రోజున ప్రిన్సిపాల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కోర్టులు సరిగా పని చేయకపోవడంతో ఇన్ని రోజులు పిటిషన్ పెండింగులో వస్తూ ఉన్నది.
 
చివరికి కేసు ఆధారాలను, పూర్వపరాలను పరిశీలించిన తరువాత ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబు లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా న్యాయమూర్తి సాయిసుధ ఆదేశాలు జారీ చేశారు. 
 
ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఐ.పి.ఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న స్వేరోస్ అధినేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా హిందువుల విశ్వసాలను దెబ్బతీసినాడని మహేందర్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు.
 
హిందువులకు, హిందు దేవుళ్లకు, దేశానికి వ్యతిరేకంగా సెక్యూలర్ ముసుగులో మాట్లాడడం ఒక ఫ్యాషన్ గా మార్చుకున్నారని, వీళ్ళు ఎంతటివారైన విడిచిపెట్టేదిలేదని బేతి మహేందర్ రెడ్డి హెచ్చరించారు.
 తాజాగా కేసు ఆధారాలను, పూర్వపరాలను పరిశీలించిన  తరువాత  ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.  కోర్టు ఆదేశాల మేరకు వెంటనే  ప్రవీణ్ కుమార్, న్యాతరి శంకర్ బాబులపై అరెస్ట్ చేయాలని మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఐపీఎస్ కు  ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు చేసిన దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వంమరుసటి రోజే ఆమోదించింది.  ఆ  మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.