ముస్లిం రాష్ట్రీయ మంచ్ లో డా. భాగవత్ ఏం మాట్లాడారు?

ఆయుష్ నడింపల్లి,

తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్

ఇటీవల ఘాజియాబాద్ లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆర్.ఎస్. ఎస్ పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ పాల్గొన్నారు. అందులో వారు చేసిన ఉపన్యాసంలోని పలు అంశాలపై వివిధ మీడియా మాధ్యమాలలో చర్చ జరుగుతోంది. అనేకమంది అనేక రకాలుగా వ్యాఖ్యానించారు కూడా. కానీ ఆ సమావేశ నేపధ్యం, అందులో పూజనీయ సర్ సంఘచాలక్ చెప్పిన విషయాలను జాగ్రత్తగా అర్ధంచేసుకుంటే ఈ వ్యాఖ్యానాలు, వాదనలకు తావుండదు.

ఆ సమావేశం ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినది. అందులో వివిధ ముస్లిం ప్రముఖులు, మాజీ సైనికాధికారులు, తదితరులు పాల్గొన్నారు. కాబట్టి అది ముస్లిములకు సంబంధించిన కార్యక్రమం.

– డా. ఖ్వాజా ఇఫ్తికార్ అహ్మద్ వ్రాసిన `మీటింగ్ ఆఫ్ మైండ్స్ – ఏ బ్రిడ్జింగ్ ఇనీషియేటివ్ అనే ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ సభ అది. హిందూ, ముస్లిముల మధ్య సయోధ్య, సమైక్యత గురించి అహ్మద్ తన పుస్తకంలో ప్రస్తావించారు.

– పూజనీయ సర్ సంఘచాలక్ కంటే ముందు మాట్లాడిన అహ్మద్ అనేక విషయాలు ప్రస్తావించారు. ఖిలాఫత్ కు సమర్ధన తెలుపడం పెద్ద తప్పిదమని అభిప్రాయపడ్డారు.

– ఆ తరువాత మాట్లాడిన పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ జీ అహ్మద్ ప్రస్తావించిన విషయాలను పేర్కొంటూ సంఘ దృష్టిని ప్రతిపాదించారు.

– మనది హిందూ రాష్ట్రం(దేశం) అనే విషయాన్ని పూజనీయ సర్ సంఘచాలక్ స్పష్టం చేశారు.

– ఈ దేశంలోని వారంతా హిందువులేనని, 1. ఈ దేశాన్ని మాతృభూమిగా భావించడం; 2. సంస్కృతిక పరంపరను గౌరవించడం; 3. మనందరి పూర్వజులు ఒక్కరేనని గుర్తించడం అనే మూడు లక్షణాలు కలిగినవాడే హిందువు అని ఆయన వివరించారు.

– ఏ మతసంప్రదాయాన్ని అనుసరించినా ఇక్కడి వారంతా హిందువులేనని పేర్కొన్నారు. మతసంప్రదాయాలను బట్టి ఈ విషయం మారిపోదని కూడా చెప్పారు.

– ఇస్లాం ఈ దేశానికి దురాక్రమణదారులతో వచ్చిందని, హిందూ సమాజంపై అనేక లోతైన గాయాలు అయ్యాయని, అవి మానడానికి సమయం పడుతుందని అన్నారు.

– దేశ ప్రజానీకంలో ఐక్యత సాధించడానికి గురునానక్, తుకారాం, సమర్ధ రామదాస స్వామి వంటివారు కృషి చేశారని, అందులో భాగంగానే మతాలు వేరైనా మనమంతా ఒకటనేనని చెప్పారని గుర్తుచేశారు.

– సంఘ గురించి ముస్లింలలో ఉన్న అనవసర భయాలు, భ్రమలను తొలగించేందుకు కూడా పూజనీయ సర్ సంఘచాలక్ ప్రయత్నించారు.

– సంభాషణ, చర్చల ద్వారా సమన్వయాన్ని, సమైక్యతను సాధించవచ్చనే విషయాన్ని నొక్కి చెప్పారు.

– తాను కొత్త విషయాలు ఏవీ చెప్పడం లేదని, సంఘ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ జీ తో మొదలుపెట్టి తనకంటే ముందున్న సర్ సంఘచాలక్ లు చెప్పిన విషయాలనే తాను మరోసారి గుర్తుచేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

– సంఘ గురించి, హిందూ సమాజం గురించి సరిగా, పూర్తి అవగాహనతో అర్ధం చేసుకుంటున్న ముస్లింల సంఖ్య తక్కువైనా, ఇతరులలో కూడా అటువంటి మార్పు రావాలని ఆకాంక్షించారు.

– ఒకప్పుడు తాము పాలకులమని, మళ్ళీ ఈ దేశాన్ని పరిపాలిస్తామనే కొందరు ముస్లిం నాయకుల వాదన అర్ధరహితమని తేల్చిచెప్పారు.

– ఈ సమావేశం 80 ముస్లిం దేశాల్లోలైవ్ ప్రసారం జరిగింది. ఆయా దేశాల్లో ముస్లిం మేధావులు పూజనీయ సర్ సంఘచాలక్ జీ చెప్పిన విషయాలను ఆహ్వానించారు.

సమావేశ వేదికపై `హిందూస్తాన్ ఫస్ట్, హిందూస్తానీ బెస్ట్’(హిందుస్తాన్ కే ప్రధమ ప్రాధాన్యత, హిందూస్తానీ ఉత్కృష్టమైనది) అనే బ్యానర్ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తోంది.