యోగా దినోత్సవం రోజున టీకాలలో భారత్ రికార్డ్ 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత దేశం వ్యాక్సినేషన్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 84 లక్షల మంది ప్రజలు వ్యాక్సినేషన్ వేసుకున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ తీసుకోవడం ఇదే ప్రథమం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది.

ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఏప్రిల్‌ 2న గరిష్ఠంగా 42 లక్షల మందికి టీకా పంపిణీ చేశారు. దానితో పోలిస్తే.. తాజాగా రెట్టింపు సంఖ్యలో టీకాలు వేశారు. మరోవైపు వీరిలో 55 శాతం మంది 18-44 ఏళ్లలోపు వారేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  వ్యాక్సినేషన్ విషయంలో రికార్డు సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

దేశంలో పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ ఉచిత టీకా పంపిణీ ఘనంగా ప్రారంభమైంది. టీకాలు సరిపడా అందజేయడంతో యువత భారీగా వచ్చాయారు. కేంద్రీకృత వ్యాక్సినేషన్‌ విధానం సమర్థతకు ఇది నిదర్శమని.. 68 వేలపైగా కేంద్రాల్లో పంపిణీ జరిగిందని కేంద్రం వివరించింది. ఒక్కరోజులో మన దేశంలో వేసిన టీకాలు న్యూజిలాండ్‌, ఇజ్రాయిల్‌ జనాభాకు సమానమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

సవరించిన విధానంలో.. 18 ఏళ్లు పైబడినవారికి టీకాను ఉచితంగా అందించాలని కేంద్రం ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఉత్పత్తి సంస్థల నుంచి 75 శాతం టీకాలను నేరుగా కొనుగోలు చేస్తోంది. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 50 లక్షల మందికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం నిర్దేశించుకుంది. అయితే, ఈ లక్ష్యానికి అదనంగానే పంపిణీ జరిగింది.

తాజా టీకా పంపిణీ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జోరుగా సాగింది. 84 లక్షల టీకాల్లో 70 శాతం పైగా ఈ రాష్ట్రాల్లోనే వేశారు. మధ్యప్రదేశ్‌ (16 లక్షలు) టాప్‌లో ఉండగా, కర్ణాటక (10 లక్షలు), ఉత్తర ప్రదేశ్‌ (6.6 లక్షలు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.  గుజరాత్‌ (5 లక్షలు), హరియాణ (4.7 లక్షలు) గణాంకాలను కలిపితే 50 శాతం టీకాలు

ఈ ఐదు రాష్ట్రాల్లోనే వేసినట్లు అవుతోంది. టీకా ఉత్సవ్‌ పేరిట ఈ రాష్ట్రాలు భారీ సంఖ్యలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశాయి. లక్ష్యానికి 50 శాతం అదనంగా పంపిణీ చేశాయి. మరోవైపు బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ సాదాసీదాగా సాగింది. మహారాష్ట్రలో 33 లక్షల డోసులున్నా 3.6 లక్షల మందికే టీకా వేశారని కేంద్రం పేర్కొంది. పంజాబ్‌, జార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఢిల్లీల్లో ఏ రాష్ట్రంలోనూ లక్షకు మించి డోసులు పంపిణీ కాలేదని తెలిపింది.

కాగా, దేశంలో కరోనా కేసులు మరింత తగ్గాయి. ఆదివారం 53,256 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. గత 88 రోజుల్లో ఇవే అత్యల్ప కేసులు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,99,35,221కి చేరింది. వరుసగా 39వ రోజూ రికవరీలు అధికంగా ఉండటంతో యాక్టివ్‌ కేసులు తగ్గాయి. వైర్‌సతో 1,422 మంది మృతిచెందారు.