హుజూరాబాద్ ఉపఎన్నికతో వారసత్వ రాజకీయం అంతం 

సీఎం కేసీఆర్ అహంకారాన్ని అణిచివేసి, వారసత్వ రాజకీయాలను అంతం చేసే ప్రజాతీర్పు హుజూరాబాద్​ ఉపఎన్నికలో బీజేపీ రానుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్  చుగ్ తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టే ఈ ఎన్నికలో గెలుపు ముమ్మాటికీ బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. 2023 ఎన్నికలకు ఇది ట్రయల్స్ కాబోతున్నదని పేర్కొన్నారు. 

సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో తరుణ్​ చుగ్​ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు​ బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్​తోపాటు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, పార్టీ నేతలు మంత్రి శ్రీనివాస్, స్వామి గౌడ్, ఇంద్రసేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తరుణ్  చుగ్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ బలమైన శక్తి అని, రాహుల్, మమత లాంటి వాళ్లే బీజేపీ ముందు తల వంచారని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో  ప్రతి బీజేపీ కార్యకర్త ఒక ఈటల రాజేందర్ అనుకొని పని చేస్తే టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం కోసం ఈటల రాజేందర్​ అన్నింటినీ వదులుకున్నారని కొనియాడారు. 

కేసీఆర్ అహంకారాన్ని మనందరం కలిసి అణిచివేసే అవకాశం హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో వచ్చిందని బీజేపీ నేతలకు తరుణ్​ చుగ్​ సూచించారు. ఈ ఎన్నికలో బీజేపీని గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. రైతులు, యువకులు, ఉద్యోగులను ఇలా అన్ని వర్గాల వారిని కేసీఆర్​ మోసం చేశారని మండిపడ్డారు. 

తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరిగే ఎన్నిక హుజూరాబాద్​ ఉపఎన్నిక అని చెప్పాఅన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి అరిష్టమని మాజీ మంత్రి ఈటల రాజేందర్​ విమర్శించారు. 50 రోజులుగా హుజూరాబాద్ లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని చెప్పారు. గ్రామస్థాయిలో ప్రజలను కలుస్తూ వారి మద్దతు పొందుతానని పేర్కొన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తల సహాయ, సహకారాలతో భారీ మెజార్టీతో తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ రాక్షస పాలన నుంచి హుజూరాబాద్ ప్రజలను కాపాడుకుంటానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో కేసీఆర్ ఎన్ని అప్రజాస్వామిక పద్ధతుల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నించినా చివరకు అంతిమ విజయం తనదేనని భరోసా వ్యక్తం చేశారు.

బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంకు ఈటల రాజేందర్​ వచ్చారు. ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్, పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, స్వామి గౌడ్ తదితరులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈటలతో పాటు బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, గండ్ర నళినిని కూడా పార్టీ ఆఫీసులో సన్మానించారు. 

అనంతరం తరుణ్ చుగ్ తో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశానికి వీళ్లు హాజరయ్యారు. త్వరలో జరుగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో వార్ వన్  సైడేనని, బీజేపీ గెలుపు ఖాయమని బండి సంజయ్ ఈ సందర్భంగా భరోసా వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్​  తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికవుతారని ధీమా వ్యక్తం చేశారు. 

పోటీలో దింపేందుకు టీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకడం లేదని, ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. కలెక్టర్లు  కేసీఆర్ కాళ్లు మొక్కడం సిగ్గుచేటని, కేసీఆర్ అధికారులను అలా శాసిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని, కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో అన్ని పథకాలను కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 

రోజూ యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ చెప్పారు. హైదరాబాద్ బర్కత్ పురలోని బీజేపీ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.  సాధన ఠాకూర్ రాసిన ‘యోగా ఫర్ కిడ్స్’ బుక్ ను ఆవిష్కరించారు. వారితో స్వయంగా యోగా చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షల ఏండ్లుగా యోగా మన కల్చర్ లో భాగంగా ఉన్నా ఎవరూ ఆచరించలేదని విచారం వ్యక్తం చేశారు. మన జీవన విధానంలో భాగమైన యోగాను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ప్రధాని మోదీ  చొరవతో మళ్లీ యోగాకు ప్రాధాన్యం ఏర్పడిందని పేర్కొన్నారు. యోగాను మోడీ  ప్రపంచ వేదికపై నిలిపారని కొనియాడారు.