ప్రముఖ సాహితీవేత్త శ్రీ నరేంద్ర కోహ్లీ అస్త‌మ‌యం

ప్రముఖ రచయిత, సాహితీవేత్త‌ శ్రీ న‌రేంద్ర కోహ్లి (81) ఏప్రిల్ 17 రాత్రి స‌మ‌యంలో మ‌ర‌ణించారు. క‌రోనా పాజిటివ్ తో శుక్రవారం ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న శ‌నివారం రాత్రి క‌న్నుమూశారు.

1940లో పాకిస్తాన్‌లో జన్మించిన అతని కుటుంబం దేశ‌విభజన తర్వాత బీహార్‌కు వలస వచ్చింది. పౌరాణికంగా, చరిత్రాత్మకమైన ఎన్నోగొప్ప ర‌చ‌న‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం 2017లో ఆయ‌న‌కు పద్మ‌శ్రీ అవార్డును ప్ర‌క‌టించింది.

రామాయ‌ణం, మ‌హాభార‌తం వంటి పౌరాణికాల్లోని పాత్ర‌లను ఆధారంగా చేసుకుని స‌మ‌కాలీక విష‌యాల‌పై ఆయ‌న ర‌చ‌న‌లు చేశారు. మహాభారతంపై ఆయ‌న ర‌చించిన 8అధ్య‌యనాలు, మ‌హాస‌మ‌ర్‌(మ‌హాయుద్ధం) వంటివి ఆయ‌న ర‌చ‌న‌ల్లో ఉత్తమ రచనలుగా నిలిచాయి. భార‌త‌దేశ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు పునరుజ్జీవనంగా ఆయ‌న ర‌చ‌న‌లు ఉండేవి. నవలలు, వ్యాసాలు 100 కు పైగా పుస్తకాల‌ను ఆయ‌న రాశారు.

శ్రీ నరేంద్ర కోహ్లీ మృతి పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆధ్యాత్మికంగా, చారిత్ర‌కంగా, పౌరాణికంగా ఆయ‌న చేసిన రచనలు చ‌రిత్ర‌లో నిలిచిపోతాయ‌ని ఆయ‌న అన్నారు.

హిందీ సాహిత్యానికి శ్రీ కోహ్లీ ఎంతో కృషి చేశారని రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు. అతను మన పౌరాణిక రచనలను ప్రపంచానికి అందించార‌‌ని తెలిపారు.

ఆర్‌.ఎస్‌.ఎస్ సంతాపం

ప్రఖ్యాత సాహిత్యవేత్త శ్రీ నరేంద్ర కోహ్లీ మరణించిన విషాద వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింద‌ని ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ సంఘ‌చాల‌క్ ప‌ర‌మ పూజ్య‌నీయ శ్రీ మోహ‌న్ భాగ‌వ‌త్‌, స‌ర్ కార్య‌వాహ ప‌ర‌మ పూజ్య‌నీయ శ్రీ దత్తాత్రేయ హొస‌‌బ‌లే గారు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. శ్రీ న‌రేంద్ర కోహ్లి గారి ర‌చ‌న‌లు భారతీయ సాహిత్య ప్రపంచానికి మూలంగా ఉండేవ‌ని వారు పేర్కొన్నారు. కోహ్లీ గారి వంటి కవి తన రచనల ద్వారా ఈ దేశ వారసత్వం, గొప్ప సంప్రదాయాలను సమకాలీన సందర్భంలో నిర్వచించార‌ని పేర్కొన్నారు. హిందీ సాహిత్యంలో ఆయ‌న కొత్త కొత్త ప్ర‌య‌త్నాలు, ఆవిష్క‌ర‌ణ‌లు చేశార‌ని పేర్కొన్నారు. ఆయ‌న మ‌ర‌ణంతో హిందీ సాహిత్యంలో ఒక శ‌కం ముగిసింద‌ని వారు పేర్కొన్నారు. ఆయ‌న మృతి ప‌ట్ల వారి కుటుంబ సభ్యుల‌కు సంతాపం తెలుపుతూ ఆయ‌న‌ ఆత్మకు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్న‌ట్టు వారు పేర్కొన్నారు.