కేటీఆర్‌పై విజయశాంతి వ్యంగాస్త్రం!

అమ్మకు అన్నం పెట్టనోడు… పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తున్నాడంటూ మంత్రి కేటీఆర్‌పై  సినీ నటి, బిజెపి నేత విజయశాంతి వ్యంగాస్త్రం సంధించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై అవసరమైతే అక్కడకు వెళ్లి నిరసనలో పాల్గొనటానని మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనను ఆమె ఎద్దేవా చేశారు. 
 
‘‘అమ్మకు అన్నం పెట్టనోడు… పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడని… తెలంగాణలో తరచుగా వినిపించే సామెత. సరిగ్గా టీఆర్ఎస్ నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోంది” అంటూ ఆమె ఫేస్‌బుక్‌ వేదికగా వాఖ్యానించారు.
 
 విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ అవసరమైతే అక్కడికెళ్ళి నేరుగా ఉద్యమంలో పాల్గొంటామంటూ కేంద్రంపై చిర్రుబుర్రులాడారని అంటూ తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిదని అంటూ ఆమె చురకలు అంటించారు. 
 
ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చారని విజయశాంతి గుర్తు చేశారు. ఇప్పుడు మాటమాత్రంగానైనా వాటి ప్రస్తావన చెయ్యడం లేదే అని ఆమె ప్రశ్నించారు. 
ఇంతకీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసం మాటలే తప్ప, ఈ దొర కుటుంబపు అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరంగా… అవమానించే ధోరణిలో… బూతు మాటలతో కూడి ఉంటుందో ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే, వీరి ప్రస్తుత ప్రకటనలను సమర్థిస్తున్న ఆయా నేతలు కొందరికి సరిగ్గా అర్థం అవుతుందని విజయశాంతి ధ్వజమెత్తారు.