దేశంలో పార్టీ మారిన వారిలో 42 శాతం కాంగ్రెస్ వారే!

 
నాయకత్వ సంక్షోభం కారణంగా దేశ రాజకీయ చిత్ర పాఠం నుండి క్రమంగా కనుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నేతలలో అవిశ్వాసం తలెత్తుతుంది. అందుకనే దేశంలో పార్టీ మారుతున్న ప్రజా ప్రతినిధులతో 42 శాతం మంది కాంగ్రెస్ వారే. 

2016-20 మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడానికి దాదాపు 170 మంది ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఇతర పార్టీల్లో చేరారని, ఇదే కాలంలో కేవలం 18 మంది బిజెపి ఎంఎల్‌ఎలు మాత్రమే పార్టీ మారారని ఎన్నికల నిఘా వేదిక అసోసియేషన్ పర్ డెమొక్రటిక్ రిఫార్మ్(ఎడిఆర్) నివేదిక వెల్లడించింది.

పార్టీలు మార్చి తిరిగి పోటీకి నిలిచిన 405 మంది ఎంఎల్‌ఎల్లో 182 మంది బిజెపిలో చేరగా, 38 మంది కాంగ్రెస్‌లో, 25 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)లో చేరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఐదుగురు లోక్‌సభ ఎంపిలు బిజెపిని విడిచిపెట్టి ఇతర పార్టీల్లో చేరారు. 2016-20 మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో ఏడుగురు రాజ్యసభ ఎంపిలు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి ఇతర పార్టీల నుంచి పోటీ చేశారు.

మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీల్లో ఇటీవల ప్రభుత్వాలు కూలిపోడానికి ఆయా అధికార పార్టీల ఎంఎల్‌ఎలు పార్టీ ఫిరాయించడమే కారణంగా నివేదిక వివరించింది. 2016-20 మధ్యకాలంలో తిరిగి రాజ్యసభకు పోటీ చేసిన 16 మంది రాజ్యసభ ఎంపిల్లో 10 మంది పార్టీ ఫిరాయించి బిజెపిలో చేరారు. అలాగే 12 మంది లోక్‌సభ ఎంపిల్లో ఐదుగురు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరారు. 

ఐదేళ్లలో పార్టీలను మార్చి, తిరిగి ఎన్నికలను నిర్వహించిన 443 మంది ఎమ్మెల్యేలు, ఎంపీిల ఎన్నికల అఫిడవిట్లను ఎడిఆర్‌ విశ్లేషించగా, ఈ ప్రబుద్ధుల ఆస్తులు 39 శాతం దాకా పెరిగాయి. 2016-2020 మధ్య కాలంలో 405 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడ్డారని తేలింది. 
 
వీరిలో కాంగ్రెస్‌ నుంచి 170 మంది (42 శాతం), బిజెపి నుంచి 18 మంది (4.4 శాతం), బిఎస్‌పి నుంచి 17 మంది (4.2 శాతం), ఎన్‌పిఎఫ్‌ నుంచి 15 మంది(3.7 శాతం), ఎన్‌సిపి నుంచి 14 మంది (3.5 శాతం), ఎస్‌పి నుంచి 12 మంది ( 3 శాతం) , ఆర్‌జెడి నుంచి 10 మంది (2.5 శాతం), జెడిఎస్‌ నుంచి తొమ్మిది మంది (2.2 శాతం) , ఐఎన్‌ఎల్‌డి ఎనిమిది మంది (2 శాతం), ఆప్‌ నుంచి ఏడుగురు (1.7 శాతం), జెవిఎం(పి) నుంచి ఏడుగురు (1.7), జెడియు నుంచి ఐదుగురు (1.2 శాతం) ఫిరాయించారు. 
 
తృణముల్‌ కాంగ్రెస్‌, బిజెడి, కెజెపి, ఎంఎస్‌సిసి, పిపిఎ, ఎస్‌ఎడి, ఎస్‌కెఎంల నుంచి నలుగురు (1 శాతం) చొప్పున ఎమ్మెల్యేలు ఫిరాయించగా, అన్నాడిఎంకె, బిఎస్‌ఆర్‌సి, జెఎంఎం, ఎన్‌పిఈపిటిల నుంచి ముగ్గురు (0.7 శాతం) చొప్పున ఫిరాయించారు. ఎజిపి, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఎఐయుడిఎఫ్‌, డిఎండికె, క్యూఈడి, ఆర్‌ఎల్‌డి, ఎస్‌జెడి, ఆర్‌ఎస్‌పి తదితర పార్టీ నుంచి కూడా జంపింగ్‌లు చోటు చేసుకున్నాయని ఆ నివేదిక తెలిపింది.
 
వీరిలో అత్యధికులు బిజెపిలో చేరారు. బిజెపిలోకి 182 మంది (44.9 శాతం) చెరగా, కాంగ్రెస్‌లోకి 38 (9.4 శాతం) మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. తృణముల్‌ కాంగ్రెస్‌, ఎన్‌పిపిలో 16 మంది (4 శాతం) చొప్పున ఎమ్మెల్యేలు చేరారు. జెడియులో 14 (3.5 శాతం) మంది, బిఎస్‌పిలో 11 (2.7 శాతం) మంది ఎమ్మెల్యేలు చేరారు. 
 
ఎన్‌డిపిపిలో 10 (2.5 శాతం), ఎస్‌హెచ్‌ఎస్‌లో తొమ్మిది (2.2 శాతం), ఎస్‌పిలో ఎనిమిది (2 శాతం), ఎన్‌పిఎఫ్‌లో ఏడుగురు (1.7 శాతం) ఎమ్మెల్యేలు ఫిరాయించారు. ఆర్‌ఎల్‌డి, ఎస్‌డిఎఫ్‌ల్లో నలుగురు (1 శాతం) ఎమ్మెల్యేలు చొప్పున చేరారు.
 
గత నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన టిడిపి నుంచి 17 మంది (4.2 శాతం), వైసిపి నుంచి 15 మంది (3.7 శాతం), టిఆర్‌ఎస్‌ నుంచి ముగ్గురు (0.7 శాతం) ఫిరాయించారు. టిఆర్‌ఎస్‌లో 25 మంది (6.2 శాతం), టిడిపిలో 11 మంది (2.7 శాతం), వైసిపిలో ముగ్గురు (0.7 శాతం) ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి చేరారు.