శాంతి పునరుద్ధరణకు చైనాతో చర్చలు కొనసాగుతాయి 

సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణకు చైనాతో చర్చలు కొనసాగుతాయని భారత్ తెలిపింది. తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి మిగిలిన సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతుందని పేర్కొంది. అన్ని ఫ్రిక్షన్ పాయింట్స్ నుంచి ఇరు దేశాల దళాల ఉపసంహరణ లక్ష్యాన్ని సాధిస్తామని తెలిపింది. 

విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వివరాలను తెలిపారు. గల్వాన్ లోయలో గత ఏడాది జూన్‌లో భారత్-చైనా సైనికుల  మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన చైనా సైనికుల సంఖ్యను చైనా ధ్రువీకరించిందా? అనే ప్రశ్నకు మురళీధరన్ సమాధానం చెప్పారు.

చైనా సైనికులకు మరణానంతరం గౌరవ పతకాలను చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఫిబ్రవరి 19న ప్రకటించిందని తెలిపారు. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులను గౌరవిస్తున్నట్లు తెలిపిందని చెప్పారు. ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, మరణించిన చైనా సైనికులపై స్పష్టమైన వివరాలు లేవు. దీనిపై చైనా మొదటిసారి గత నెలలో స్పందించింది. గల్వాన్ లోయలో భారత సైనికులతో జరిగిన ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు చైనాతో భారత్ చర్చలు కొనసాగుతాయని మురళీధరన్ తెలిపారు. అన్ని ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద నుంచి దళాల ఉపసంహరణ లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. అతి త్వరలోనే భారత్-చైనా సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తామన్నారు. పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి ఇరు దేశాల దళాల ఉపసంహరణ పూర్తయినట్లు తెలిపారు. 

భారత్-చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం పాంగాంగ్ సరస్సు ప్రాంతాల్లో గత ఏడాది మే 5 నుంచి ప్రారంభమైంది. ఇరు దేశాలు వేలాది మంది సైనికులను, పెద్ద ఎత్తున ఆయుధాలను మోహరించాయి. ఇరు దేశాల మధ్య అనేక దశల్లో జరిగిన చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఇరు దేశాలు పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి దళాలను, ఆయుధాలను ఉపసంహరించుకున్నాయి. 

ఇతర ఫ్రిక్షన్ పాయింట్ల వద్ద నుంచి దళాల ఉపసంహరణ ప్రక్రియను చేపట్టడం కోసం ఫిబ్రవరి 20న ఇరు దేశాలు మరొకసారి చర్చించాయి. ఉద్రిక్తతలను సడలించేందుకు హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెప్సాంగ్ వంటి ప్రాంతాల నుంచి దళాలను వేగంగా ఉపసంహరించాలని భారత్ కోరింది.