హైదరాబాద్‌ వరకు హైస్పీడ్‌ కారిడార్‌

దేశవ్యాప్తంగా ఏడు నూతన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను ఎంపిక చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. అందులో ముంబై నుంచి పుణే మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ వరకు ఈ హైస్పీడ్‌ కారిడార్‌ను ఎంపిక చేశామని లోక్‌సభలో ఎంపీ జ్ఞానతి రవియం అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

ఎంపిక చేసిన ఏడు నూతన హై స్పీడ్‌ రైల్‌ కారిడార్ల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించేందుకు భారతీయ రైల్వేకు బాధ్యతలు అప్పగించామని, అయితే ఇప్పటివరకు ఏ కారిడార్‌ డీపీఆర్‌ పూర్తి కాలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. డీపీఆర్‌లోని అంశాల ఆధారంగా ఒక్కో కారిడార్‌కు ఆమోదం తెలుపుతామని మంత్రి స్పష్టం చేశారు.

దేశంలో మొత్తం 33 సైనిక్‌ స్కూళ్లు ఉన్నాయని, మరో 8 సైనిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ తెలిపారు.

 తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క సైనిక్‌ స్కూల్‌ లేకపోవడంతో, వరంగల్‌ జిల్లాలో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటుకు రక్షణ శాఖ 2017 మార్చి 2న సూత్రప్రాయ ఆమోదం తెలిపి, ఒప్పందం చేసుకుందని తెలిపారు.  అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.