అటవీ శాఖలోనూ రాణిస్తున్న మహిళలు 

మిగతా రంగాల మాదిరిగానే అటవీ శాఖలోనూ మహిళలు పోటీ పడి రాణించటం ఆహ్వానించదగిన పరిణామం అని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా అటవీ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులు, సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా ఐ.ఎఫ్.ఎస్ అధికారుల వివరాలతో కూడిన ‘గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా – నేషన్స్ ప్రైడ్’ అనే పుస్తకాన్ని మంత్రి ఆన్ లైన్ ద్వారా ఢిల్లీ నుంచి ఆవిష్కరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 284 మంది మహిళలు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో వివిధ స్థానాల్లో రాణిస్తున్నారని, వారిలో ముగ్గురు (తెలంగాణ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్) అటవీ సంరక్షణ ప్రధాన అధికారులుగా (పీసీసీఎఫ్) రాణిస్తున్నారని మంత్రి వెల్లడించారు.

మిగతా రంగాల మాదిరిగానే క్షేత్ర స్థాయిలో అడవుల్లో పనిచేసేందుకు కూడా మహిళలు, పోటీ పరీక్షల ద్వారా ఎంపికవ్వటం ఆహ్వానించదగిన పరిణామం అని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. రానున్న రోజుల్లో  అటవీ శాఖలో కూడా 33 శాతం మహిళా ఉద్యోగులు పనిచేయాలని ఆకాంక్షించారు.

తెలంగాణ అటవీ శాఖలో సుమారు 30 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారనే విషయాన్ని పీసీసీఎఫ్ ఆర్. శోభ, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగానే ఆయన అభినందించారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశ వ్యాప్తంగా అటవీ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులతో ఒక సెమినార్ ను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రిని అధికారులు కోరారు.

అన్ లైన్ వేదికగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ సమావేశానికి ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి తో పాటు పలువురు అధికారులు, ఆయా రాష్ట్రాల్లో పనిచేస్తున్నమహిళా ఐఎఫ్ఎస్ అధికారులు పాల్గొన్నారు.