అంత్యదశలో కరోనా… ఇదే కీలక దశ!

దేశంలో కరోనా మహమ్మారి అంత్యదశలో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ఇది అత్యంత కీలక దశ అని, ఇందులో విజయం సాధించాలంటే కొవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. టీకాల పంపిణీపై రాజకీయ క్రీనీడలు పడకుండా ఉంటే తప్పనిసరిగా దేశంలో కొవిడ్ అంతం అయి తీరుతుందని భరోసా వ్యక్తం చేశారు. 

ప్రజలు సైన్సుపై నమ్మకాలు పెట్టుకోవాలని చెబుతూ శాస్త్ర విజ్ఞాన ఫలితంగానే వ్యాక్సిన్ వచ్చిందని పేర్కొన్నారు.  దీనిని సకాలంలోనే  వారికి అందించేందుకు అంతా పాటుపడాల్సి ఉందని కోరారు. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ (డిఎంఎ) ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన 62వ ఢిల్లీ స్టేట్ మెడికల్ కాన్ఫరెన్స్ (మెడికాన్ 2021) వార్షికోత్సవ సభలో మంత్రి మాట్లాడారు.

ధర్మశిల నారాయణ ఆసుపత్రి సహకారంతో ఈ సమావేశం ఏర్పాటు అయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందికి కరోనా టీకాలు వేశారని, ఇప్పుడు రోజువారి టీకాల పంపిణీ స్థాయి 15 లక్షలకు చేరిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. కొవిడ్ నియంత్రణలో దేశం అన్నింటా బాగా వ్యవహరిస్తోందని, పలు రకాల అదుపు చర్యలు చేపట్టారని, ఇక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో వ్యాక్సిన్ల సరఫరా పెరుగుతోందని పేర్కొన్నారు.

పైగా అత్యంత సమర్థవంతం, సురక్షితం అయిన టీకాలనే అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఎటువంటి ప్రతికూలతలు లేకుండా ఇక్కడ వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయని, ఈ భారత్ తయారీ వ్యాక్సిన్ల సామర్థంఅన్ని విధాలుగా నిరూపితం అయిందని చెప్పారు.

వివిధ రకాల కరోనా వైరస్‌ల నుంచి భారతదేశం సురక్షితంగా ఉండటం అనేది అన్ని దేశాల్లో పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. అక్కడ వైరస్ నుంచి భద్రత లేకపోతే దీని ప్రభావం ప్రస్తుత గ్లోబలైజేషన్ పరిస్థితుల మధ్య మనదేశంపైనా ఉంటుందని తెలిపారు. అందుకే అన్ని దేశాలు విధిగా కొవిడ్ 19 వ్యాక్సినేషన్ జాతీయవాదాన్ని అవలంభించాల్సి ఉంటుందని సూచించారు.